Vijayasai Reddy : జగన్ కోటరీపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
జగన్ కోటరీపై మరోసారి విరుచుకుపడిన విజయసాయిరెడ్డి
Vijayasai Reddy : మాజీ ఎంపీ, వైసీపీలో జగన్ తరువాత కీలకంగా పనిచేసిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజకీయాల నుండి నిష్క్రమించారు. అయితే రాజకీయాలకు ఆయన దూరంగా జరిగినప్పటికీ… కాకినాడ సీ పోర్టు షేర్లు అక్రమ బదిలీ కేసులో ఇటీవల సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)… వైఎస్ జగన్ పై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్ కోటరీ వలనే అత్మాభిమానం దెబ్బతిని పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని స్ఫష్టం చేసారు. అంతేకాదు ఆ కోటరీకు ఏదైనా లాభం లేకపోతే… జగన్ అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వరంటూ సంచలన ఆరోపణలు చేసారు.
Vijayasai Reddy Slams
అయితే ఇది జరిగి మూడు రోజులు తిరగక ముందే… ఈ ‘కోటరీ’ అనే అంశంపై విజయసాయి రెడ్డి ‘ఎక్స్’లో ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. అందులో.. ‘పూర్వకాలంలో మహారాజులు కోటల్లో ఉండేవారు. కోటలో ఉన్న రాజుగారి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే… ఆహా రాజా, ఓహో రాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి, తమ ఆటలు సాగించుకునేది. దానివల్ల రాజూ పోయేవాడు, రాజ్యం కూడా పోయేది. మహారాజు తెలివైనవాడైతే కోటరీ కుట్రల్ని గమనించి, మారువేషంలో ప్రజల్లోకి వచ్చి, ఏం జరుగుతోందో తనకు తానుగా తెలుసుకునేవాడు. తర్వాత వారిమీద (కోటరీ) వేటు వేసి, రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల మనసెరిగి వారి ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Also Read : YS Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి