వ్యవసాయ భూములు రీ సర్వే చేయాలి : పీవీఎన్ మాధవ్
రీసర్వే చేసిన భూముల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలి
విజయవాడ : ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా సర్వే చేసిన భూముల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరారు. రెవెన్యూ వ్యవస్థ లో ప్రక్షాళన అవసరం ఉందన్నారు. రెవెన్యూ సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తోందని అన్నారు. భూ రీ–సర్వే, LPM, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ఆధార్ లింక్ లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి భూ యజమానులకు, రైతులకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్బుక్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రైతుల భూమి హక్కుల పరిరక్షణకు ఇది కీలకమైన కార్యక్రమం అని పేర్కొన్నారు పీవీఎన్ మాధవ్. అయితే, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో భూ రీ–సర్వే పేరుతో తప్పుడు కొలతలు, సర్వే నంబర్ల మార్పులు, హద్దులు–విస్తీర్ణంలో అవకతవకలు, LPM లో పొరపాట్లు, టైటిల్ డీడ్ , ఆధార్ లింక్ లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారయ్యాయని ఆందళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిందని, దాని స్థానంలో కొత్తగా ప్రవేశ పెట్టిన సచివాలయ గ్రామ వ్యవస్థ కూడా అవినీతికి కేరాఫ్ గా మారిందన్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. అందుకే రాష్ట్రంలోని భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సర్కార్ ను కోరారు.
