Air Chief Marshal: మిగ్-21కు స్వయంగా వీడ్కోలు పలకనున్న వాయుసేన చీఫ్
మిగ్-21కు స్వయంగా వీడ్కోలు పలకనున్న వాయుసేన చీఫ్
Air Chief Marshal : భారత వాయుసేనకు కొన్ని దశాబ్దాలుగా వెన్నముక వలే ఉండి… ఎన్నో యుద్ధాల్లో విజయాన్ని అందించిన మిగ్-21కు వాయుసేన చీఫ్ ఏపీ సింగ్ వీడ్కోలు పలకనున్నారు. ఛండీగఢ్ వాయుసేన కేంద్రం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఐఏఎఫ్ చీఫ్ స్వయంగా మిగ్-21 బైసన్ (Air Chief Marshal) పై చివరి సారి ట్రిప్ కి వెళ్లనున్నారు. ఈ రకం విమానం భారత్లో తొలిసారి అడుగుపెట్టింది కూడా ఈ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోనే కావడం విశేషం. నాడు ‘ఫస్ట్ సూపర్ సోనిక్స్’గా వ్యవహరించే 28వ స్క్వాడ్రన్కు వీటిని మొదటి సారి అప్పగించారు. వింగ్ కమాండర్ దిల్బాగ్ సింగ్ దీనికి నాయకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన ఎయిర్ చీఫ్ మార్షల్ స్థాయికి ఎదిగారు.
ఇక మిగ్-21లు (MIG-21) కూడా దాదాపు 60 ఏళ్లకుపైగా వాయుసేనకు సేవలు అందించాయి. ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్వయంగా 23వ స్క్వాడ్రన్ చివరి సార్టిలో పాల్గొంటున్నారు. ఆయన కాల్సైన్ ‘బాదల్ 3’. ఈ కార్యక్రమానికి సంబంధించిన విన్యాసాలు జరిగాయి. దీనికి సీడీఎస్ అనిల్ చౌహాన్ , త్రివిధదళాల అధిపతులు, ఆరుగురు వాయుసేన మాజీ చీఫ్లు, ఐఏఎఫ్ కమాండ్ల అధిపతులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో 23వ స్క్వాడ్రన్కు చెందిన 6 మిగ్-21లు భాగం కానున్నాయి. ఈ ఆరుగురు పైలట్లలో స్క్వాడ్రన్ లీడర్ ప్రియా శర్మ కూడా ఉన్నారు. సార్టి పూర్తి చేసుకొని ల్యాండ్ అయ్యాక జలఫిరంగులతో అభివాదం సమర్పించనున్నారు.
Air Chief Marshal – డ్రోన్ యుద్ధాలకు భారత్ సన్నద్ధం !
ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల ప్రమేయం పెరిగిన నేపథ్యంలో భారత సైనిక దళాలు దీనిపై దృష్టిపెట్టాయి. ఈ అంశానికి సంబంధించి తమ సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు అక్టోబరు 6 నుంచి 10 వరకూ భారీ విన్యాసాలను నిర్వహించనున్నాయి. సమీకృత రక్షణ విభాగం (ఐడీఎస్) ఆధ్వర్యంలో జరిగే ఈ యుద్ధక్రీడల్లో భారత అమ్ములపొదిలో ఉన్న డ్రోన్లు, శత్రు డ్రోన్లను నేలకూల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు. పాకిస్థాన్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టాక త్రివిధ దళాల భాగస్వామ్యంతో జరుగుతున్న తొలి సైనిక విన్యాసమిదే. మధ్యప్రదేశ్లో (MP) ఈ కార్యక్రమం జరుగుతుంది. గగనతల రక్షణ వ్యవస్థలపై మంగళవారం దిల్లీలో జరిగిన ఒక సదస్సులో ఐడీఎస్ ఉప అధిపతి ఎయిర్ మార్షల్ రాకేశ్ సిన్హా ఈ విషయాన్ని తెలిపారు. ఆపరేషన్ సిందూర్లో నేర్చుకున్న పాఠాలను ఆయన వివరించారు. సైనిక వ్యూహాలు, ప్రణాళికల్లో శత్రువు కన్నా ముందంజలో ఉండాలన్నారు.
ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన దాడికి ప్రతిగా పాకిస్థాన్ భారీ స్థాయిలో మన దేశంపైకి డ్రోన్లను పంపిన సంగతి తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలో డ్రోన్లను నిర్వీర్యం చేసే వ్యవస్థలను వేగంగా సిద్ధం చేయాలన్న సందేశాన్ని ఈ ఆపరేషన్ మనకు ఇచ్చింది. నాడు నేర్చుకున్న పాఠాల ఆధారంగా చర్యలకు దిగాలి. మన పోరాట సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భాగస్వామ్యాలు, నూతన ఆవిష్కరణలను పెంచుకోవాలి’’ అని రాకేశ్ సిన్హా పేర్కొన్నారు. వచ్చే నెలలో నిర్వహించే విన్యాసాల్లో త్రివిధ దళాలతోపాటు పరిశ్రమలు, పరిశోధన ల్యాబ్లు, విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. దేశ గగనతల రక్షణ, డ్రోన్ వ్యవస్థలను మరింత బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.
Also Read : Elon Musk: మస్క్ ‘ఎక్స్’ దావా కేసును తోసిపుచ్చిన న్యాయస్థానం
