Akunuri Murali : పవన్..షర్మిలపై ఆకునూరి మురళి ఫైర్
వేరే రాష్ట్రాల నేతలకు తెలంగాణలో ఏం పని
Akunuri Murali : మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల నాయకులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ వల్లకాడుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకునూరి మురళి ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బులతో రాజకీయం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
వేరే రాష్ట్రాల నేతలకు తెలంగాణలో రాజకీయాలు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన ఆ పార్టీ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడా ఆకునూరి మురళి(Akunuri Murali) ఏకి పారేశారు. ఇప్పటికే తెలంగాణ పేరుతో కోట్లు కొల్లగొట్టిన కల్వకుంట్ల దొరకు ఆంధ్రాలో రాజకీయం చేయడం అవసరమా అని ప్రశ్నించారు.
కడప జిల్లాకు చెందిన వైఎస్ షర్మిలకు, భీమవరం జిల్లాకు చెందిన కొణిదెల పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో ఎందుకు రాజకీయం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కోట్లు కొల్లగొట్టిన వీళ్లు తమ ఆస్తులను కాపాడుకునేందుకే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారంటూ ధ్వజమెత్తారు ఆకునూరి మురళి. బాగా డబ్బుందని రాజకీయ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అస్సలు వీళ్లకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని, ఏం వ్యాపారాలు చేశారని ఇంతలా సంపాదించారంటూ ప్రశ్నించారు. ప్రజల గురించి, వారి సమస్యల గురించి వీరికి ఏమాత్రం పట్టదన్నారు. తెలంగాణ ప్రాంతం గురించి వీరిలో ఒక్కరికైనా అవగాహన ఉందా అని నిలదీశారు. ఇక ఉద్యమం పేరుతో రాష్ట్రంలో పవర్ లోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆకునూరి మురళి(Akunuri Murali) .
Also Read : దుర్గమ్మ సన్నిధిలో పవన్ కళ్యాణ్
