మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 5 వరకు కొనసాగుతాయన్న తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి . ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 26న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. ఉత్సవాలలో భాగంగా మార్చి 27న ఉదయం ధ్వజారోహణం (ఉదయం 9.30 నుండి 10.15 గంటల వరకు వృషభ లగ్నం), 11 గం.ల నుండి 12 గం.ల వరకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గం.ల నుండి పోతన జయంతి, కవి సమ్మేళనం జరుగుతుంది. రాత్రి శేష వాహనం నిర్వహిస్తారు.
28న ఉదయ వేణు గానాలంకారం, రాత్రి హంస వాహనం, 29న ఉదయం వటపత్ర శాయి అలంకారం, రాత్రి సింహ వాహనం,, 30న ఉదయం నవనీత కృష్ణాలంకారం, రాత్రి హనుమంత వాహనం, 31న ఉదయం మోహినీ అలంకారం, రాత్రి గరుడ సేవ జరుగుతుందని టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 1వ తేదీన ఉదయం శివధనుర్భాణ అలంకరణ, మధ్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం,
సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనం ఉంటుంది. 2న ఉదయం రథోత్సవం, 3న ఉదయం కాళీయ మర్ధనాలంకారం, రాత్రి అశ్వ వాహనం, 4న ఉదయం చక్ర స్నానం, రాత్రి ధ్వజారోహణం, 5న సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పుష్ప యాగం నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది.
