BRS Party Comment : కేసీఆర్ కలలు గులాబీ రెపరెపలు
భారత రాష్ట్ర సమితి జెండా ఎగరేనా
BRS Party Comment : ఇవాళ దేశ వ్యాప్తంగా విజయ దశమి పండుగ. జాతీయ రాజకీయాలలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. అసాధాన్యాన్ని సుసాధ్యం చేసిన అరుదైన నాయకుడిగా పేరొందారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈ పేరు కంటే కేసీఆర్ అంటే దేశంలో ప్రతి ఒక్కరికీ తెలుసు.
ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు జరిగిన మోసాన్ని, దోపిడీని కళ్లకు కట్టినట్లుగా చిత్రీకరించడంలో జాతీయంగా దానిని చర్చకు తీసుకు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. చివరకు ప్రత్యేక తెలంగాణ వాదాన్ని కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడంలో కీలక పాత్ర పోషించాడు కేసీఆర్.
నిలువెల్ల గాయాలతో తల్లడిల్లిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఈరోజు వరకు ఇంకా సమస్యలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. కొత్త రాష్ట్రానికి దళితుడే సీఎం అని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. రెండోసారి తానే సీఎంగా కొలువు తీరారు. నిధులు,
నీళ్లు, నియామకాలు పేరుతో ఏర్పాటైన రాష్ట్రంలో ఇవాళ సవాలక్ష సమస్యలతో కునారిల్లుతోంది తెలంగాణ.
దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని చెబుతూ వస్తున్నా ఆచరణలో అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఈరోజు వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. దేవుడి దయ వల్ల వర్షాలు సమృద్దిగా కురుస్తున్నా రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారనేది తెలియడం లేదు.
పండించిన పంటలకు కనీస మద్దతు ధర లభించక నానా తంటాలు పడుతున్నారు. కులాల పేరుతో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. కానీ పల్లెల్లో ఉన్న బడులు మాత్రం కునారిల్లి పోయాయి. సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
కొత్త జిల్లాలు ఏర్పాటైనా ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బందిని భర్తీ చేయలేదు. పాలనా పరంగా ఇబ్బందులు నెలకొన్నాయి. బ్యూరోక్రసీ గతి తప్పింది. ఇక
త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణ పథకాల పేరుతో ప్రజలను మభ్య పెడుతూ వస్తున్నారే కానీ మౌలిక సదుపాయాలు
కల్పించేందుకు ఎక్కడా చర్యలు చేపట్టలేదు.
ప్రజలకు తాయిలాలు ఇస్తూ వస్తున్నారే తప్పా ఎక్కడా ఆచరణలో పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఉన్నట్టుండి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు
కేసీఆర్. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్లు (BRS Party) ప్రకటించారు. తలపండిన నాయకులు, పార్టీలు కొలువు తీరాయి దేశంలో.
ఈ తరుణంలో బీఆర్ఎస్ దేశంలో మోదీకి, భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా చేసేందుకు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఇప్పటికే ఎంతో
మంది , ఎన్నో పార్టీలు మరింత బలపడేందుకు ప్రయత్నం చేశాయి. కానీ సక్సెస్ కాలేక పోయాయి. ఇప్పటికే తాను యుద్దం
చేసేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు కేసీఆర్.
ఒంటరిగా భారత రాష్ట్ర సమితి సక్సెస్ అవుతుందా అన్నది ప్రశ్నార్థకమే. దేశ మంతటా విస్తరించాలంటే బలమైన పునాదితో పాటు నాయకత్వం
అవసరం. భావ సారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ప్రయాణం చేసినా ఏకైక పోటీదారుగా ఉండడం చాలా కష్టమైన విషయం. నాయకుడిగా కేసీఆర్
చెల్లుబాటు కావచ్చు కానీ ఆయన తర్వాత ఎవరు అంతగా ప్రభావం చూపుతారనేది అనుమానమే.
పలు భాషల్లో పట్టు కలిగిన సీఎం దేశ కాల పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ముందకు సాగవచ్చు. కానీ ఓ వైపు బీజేపీ ఇంకో వైపు కాంగ్రెస్ ఆయా
రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తీవ్రమైన ప్రభావం కలిగి ఉన్నాయి. వాటిని తట్టుకుని బీఆర్ఎస్ బలమైన పార్టీగా ఎలా మారుతుందన్నది
వేచి చూడాలి. ఇందుకు కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : దేశమంతటా బీఆర్ఎస్ జెండా ఎగరాలి