Calcutta High Court: శర్మిష్ఠ పనోలీకి హైకోర్టు మధ్యంతర బెయిల్‌

శర్మిష్ఠ పనోలీకి హైకోర్టు మధ్యంతర బెయిల్‌

 

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌, లా విద్యార్ధిని శర్మిష్ట పనోలీ(22)కి కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించడంతో పాటు దేశం విడిచి వెళ్లరాదని చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదని, కేసు విచారణలో అధికారులకు సహకరించాలని ఆమెను ఆదేశించింది. అదేవిధంగా, పనోలీకి తగు భద్రత కల్పించాలని పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్‌ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్థనపై జస్టిస్‌ రాజా బసు చౌదరి సారథ్యంలోని ధర్మాసనం మంగళవారం ఇరుపక్షాల వాదనలు వింది. గురువారం తీర్పు విడుదల చేసింది.

 

పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శర్మిష్టపై దాఖలైన ఫిర్యాదులో ఎటువంటి నేర ప్రవృత్తి లేదని పనోలి తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి ఇండియా-పాకిస్థాన్ అంతటా సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరిగిందని.. వీరిలో ఎక్కువమంది పర్యాటకులని ఆయన కోర్టుకు తెలియచెప్పే ప్రయత్నం చేశారు.

 

పాకిస్థాన్‌ పై ఆపరేషన్ సిందూర్ సందర్భంగా లా స్టూడెంట్ శర్మిష్ట పనోలి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆపరేషన్‌ సిందూర్‌పై బాలీవుడ్‌ లోని ఓ వర్గం నటులు మౌనంగా ఉన్నారంటూ మే 7న చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో ఆన్‌లైన్‌లో వైరలయ్యింది. తీవ్రమైన కామెంట్లు రావడంతో మరునాడే మే 8న వీడియోను తొలగించి, క్షమాపణ చెప్పింది. బెదిరింపులు రావడంతో కుటుంబంతో సహా వేరే చోటుకు మకాం మార్చింది. అయినప్పటికీ, ఆమె తన వీడియో ద్వారా మత విద్వేషాలను ప్రేరేపించిందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. శర్మిష్టపై దాఖలైన ఫిర్యాదు మేరకు కలకత్తా పోలీసులు గతవారం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఉండగా అరెస్ట్‌ చేశారు. దీనితో మే 30వ తేదీన గురుగ్రామ్‌లో అరెస్ట్‌ చేసిన పోలీసులు కోల్‌కతాకు తరలించి… కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

దీనితో వెంటనే ఆమె బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే కోర్టు పనోలికి మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ‘చూడండి, మనకు వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ దాని అర్థం మీరు ఇతరులను బాధపెట్టడానికి కాదు. మన దేశం వైవిధ్యమైనది, వివిధ కులాలు, మతాలు, మతాలకు చెందిన వ్యక్తుల గురించి వ్యాఖ్యలు చేసేప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి’ అని జస్టిస్ పార్థ సారథి ఛటర్జీ అన్నారు.

 

ఇలా ఉండగా, పనోలి అరెస్టు పశ్చిమ బెంగాల్‌ తోపాటు, యావత్ దేశంలో రాజకీయ వివాదానికి దారితీసింది. బెంగాల్‌లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శర్మిష్ట పనోలి అరెస్టును “సెలెక్టివ్ ఎన్‌ఫోర్స్‌మెంట్”గా అభివర్ణించింది. అంతేకాదు, కోల్‌కతా పోలీసులు తొందరపాటుతో వ్యవహరించారని ఆరోపించింది. అటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా శర్మిష్ట అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాను శర్మిష్టకు అండగా ఉంటానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. డచ్ ఎంపీ కూడా శర్మిష్టను వెంటనే విడుదల చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకు సూచించారు.

Leave A Reply

Your Email Id will not be published!