Chandrababu Naidu Arrest Comment : బాబు అరెస్ట్ తప్పదా..?
ఉచ్చు బిగించిన ఐటీ శాఖ
Chandrababu Naidu Arrest Comment : ఆయన తలపండిన రాజకీయ నాయకుడు. సుదీర్ఘ అనుభవం కలిగిన నేత. 40 ఏళ్లకు పైగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ వస్తున్న సమయంలో ఉన్నట్టుండి పట్టు కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోని నైజం కలిగిన వ్యక్తిత్వం ఆయనది. నిత్యం అభివృద్ది మంత్రం జపిస్తారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఏపీ విభజన సమయంలో కూడా ఏపీకి తొలి సీఎంగా కొలువుతీరారు. చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ గుర్తుకు వస్తుంది. అంతకంటే ఎక్కువగా ప్రపంచ బ్యాంకు , వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, 2020 విజన్, 2047 విజన్ లు స్మరణకు రాకుండా మానవు.
Chandrababu Naidu Arrest Comment Viral
తాజాగా ఏపీ సీఎంగా కొలువు తీరిన సమయంలో అమరావతి రాజధాని కేంద్రంగా ముడుపులు చేతులు మారాయనేది ప్రధానమైన ఆరోపణ. దీనికి సంబంధించి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. ఇదే ప్రధానమైన అంశంగా మారింది. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తనను ఇవాళో రేపో అరెస్ట్ చేయొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తన భార్యను నిండు సభలో అవమానించారంటూ ఆవేదన పడ్డారు. ఆపై మీడియా సాక్షిగా కన్నీటి పర్యంతం అయ్యారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఆయన కన్నీళ్లు పెట్టడం.
ఇదంతా కావాలని జగన్ రెడ్డి సర్కార్ తనను ధైర్యంగా ఎదుర్కోలేక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు తనపై పెట్టిన ఏ కేసు కోర్టులో నిలవలేక పోయిందని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). రూ. 118 కోట్ల ముడుపులు ముట్టాయంటూ షోకాజ్ నోటీసులు ఐటీ శాఖ జారీ చేయడం ఒకింత విస్తు పోయేలా చేసింది. కొన్ని ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు ముడుపులుగా అందుకున్నారని, బోగస్ కాంట్రాక్టుల ద్వారా ప్రజా ధనాన్ని మళ్లించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఇప్పటి వరకు తాము ఇచ్చిన నోటీసులకు జవాబు ఇవ్వలేదని స్పష్టం చేసింది ఐటీ శాఖ.
వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో ఏక కాలంలో ఐటీ సోదాలు చేపట్టింది. ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్రలోని 40 ప్రాంతాల్లో దాడులు చేసి..రూ. 2,000 కోట్ల లెక్కలు చూపనివిగా గుర్తించింది. ఐటీ శాఖ నోటీసులపై జాతీయ మీడియా కోడై కూసింది. దీంతో చంద్రబాబు నాయుడు లైమ్ లైట్ లోకి వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భన్ కాంట్రాక్టర్ ఎవరు, కిలారు రాజేష్ ఎవరు, 2016కి ముందు ఆయన ఆర్థిక పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించింది ఐటీ శాఖ. లోకేష్ కు రాజేష్ కు ఉన్న బంధం ఏమిటి. 2019 దాకా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలకు వెళ్లారు.
ఏయే ప్రదేశాలను సందర్శించారో చెప్పాలని కోరింది. 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు డబ్బులు ఎవరు ఇచ్చారు. ఈ మొత్తం ప్రశ్నలను ఏపీ సీఐడీ విచారణలో భాగంగా సంధించింది. ఐటీ స్కామ్ , స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ ల ద్వారా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు కేసుల్లో కీలకంగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థ సన్ని, యోగేష్ గుప్తాలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని ఐటీ శాఖ నోటీసులు పంపింది. మొత్తంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేందుకు సిద్దమయ్యారా లేక తన రాజకీయ నైపుణ్యంతో తెలివిగా తప్పించుకుంటారా అన్నది వేచి చూడాలి.
Also Read : Minister KTR : ఎన్నారైల క్షమాభిక్ష కోసం ప్రయత్నం