Deepthi Jeevanji: పారాలింపిక్స్‌ పతక విజేత దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ భారీ నజరానా !

పారాలింపిక్స్‌ పతక విజేత దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ భారీ నజరానా !

Deepthi Jeevanji: పారాలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు టీ-20 విభాగంలో కాంస్య పతకం సాధించిన జీవాంజీ దీప్తిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు ప్రభుత్వం తరఫున రూ.కోటి, కోచ్‌కు రూ.10 లక్షలు నగదు బహుమతిగా ప్రకటించారు. దీప్తికి గ్రూప్‌-2 ఉద్యోగం, వరంగల్‌ లో 500 గజాల స్థలం ఇస్తామని పేర్కొన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని పారా గేమ్స్ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పారిస్‌ పారాలింపిక్స్‌లో దీప్తి మహిళల 400 మీటర్ల టీ-20 విభాగంలో కాంస్యం సాధించింది. పారాలింపిక్స్‌ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.

Deepthi Jeevanji…

జీవాంజీ దీప్తి(Deepthi Jeevanji) స్వగ్రామం వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి, లక్ష్మి. బిడ్డ విజయం వెనకాల తల్లిదండ్రుల కృషి అపారం. వీరిది నిరుపేద కుటుంబం. దీప్తికి మానసిక వైకల్యం. మేధోపరమైన బలహీనత ఉండడంతో పసితనంలో ఆమె కోసం తండ్రి యాదగిరి తల్లడిల్లారు. కూతురుకు ఫిట్స్‌ వస్తే విలవిలలాడిపోయేవారు. ఒక దశలో దీప్తి క్రీడల్లో రాణించేందుకు డబ్బులకు వెనకాడవద్దని యాదగిరి తనకున్న ఎకరం పొలాన్ని అమ్మేశారు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దీప్తి తిరుగులేని క్రీడాకారిణిగా మారింది. దీప్తి మానసిక స్థితి చూసి ఇరుగు పొరుగు వారు ఆమెను తరచూ అవహేళన చేసేవారట. ఇప్పుడు ఈమె ఏకంగా పారాలింపిక్స్‌లో పతకం సాధించి పుట్టిన గడ్డకే కాదు, రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది.

Also Read : Minister Kollu Ravindra: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొనడం కుట్రపూరితమే – మంత్రి కొల్లు రవీంద్ర

Leave A Reply

Your Email Id will not be published!