Hayagreeva Lands: నిషేధిత జాబితాలో ‘హయగ్రీవ’ భూములు ! ఉత్తర్వులు జారీ చేసిన విశాఖ కలెక్టర్ !

నిషేధిత జాబితాలో ‘హయగ్రీవ’ భూములు ! ఉత్తర్వులు జారీ చేసిన విశాఖ కలెక్టర్ !

Hayagreeva Lands: విశాఖ నగరంలోని ఎండాడలో ఉన్న ‘హయగ్రీవ’(Hayagreeva Lands) భూములను ఏపీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ మేరకు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చుతూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ హ‌రేంధిర ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక రెవిన్యూ అధికారులు హయగ్రీవ భూముల్లో ప్రభుత్వ బోర్డులను పెట్టారు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌ జరగకుండా ఈ బోర్డులు పెట్టడంతో పాటు నిషేధిత జాబితాలో వాటిని చేర్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

Hayagreeva Lands Issue

హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థకు కేటాయించిన భూ కేటాయింపులను ఏపీ ప్రభుత్వం(AP Govt) సోమవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ భూముల విలువ రూ.250 కోట్లకు పైనే ఉంటుంది. వృద్ధాశ్రమం, అనాథశరణాలయం నిర్మిస్తామని ప్రభుత్వం నుంచి రాయితీపై భూమి తీసుకుని, ఆ ప్రాజెక్టులు చేపట్టకపోగా, హయగ్రీవ సంస్థ అడుగడుగునా అక్రమాలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఆ భూమితో స్థిరాస్తి వ్యాపారం చేసిందని ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే ఆ భూముల్ని వెనక్కు తీసుకుని, ప్రజావసరాలకు వినియోగించాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ కు భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ఆర్పీ సిసోదియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో విశాఖ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎండాడలోని 12.51 ఎకరాల భూముల్లో మంగళవారం రెవెన్యూ శాఖ బోర్డులు పెట్టింది. విశాఖ జిల్లా కలెక్టర్‌ పేరిట వీటిని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read : MLC Kavitha: సీఎం రేవంత్‌ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్

Leave A Reply

Your Email Id will not be published!