Congress Win Comment : గులాబీకి పాతర జనం జాతర
అహంకారంపై ఆత్మ గౌరవం విజయం
Congress Win : నాలుగున్నర కోట్ల ప్రజలు చారిత్రాక , చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టారు. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు తెర ముగిసింది. జనం అజేయమైన తీర్పును స్పష్టంగా ఇచ్చారు. అధికారం శాశ్వతమని, డబ్బులు వెద జల్లినా , మద్యం పంపిణీ చేసినా, అధికారాన్ని దుర్వినియోగం చేసినా, ఖాకీలను అడ్డం పెట్టుకుని దాడులకు పాల్పడినా, ఎన్నికల సంఘం సపోర్ట్ తీసుకున్నా, తాయిలాలు పంపిణీ చేసినా చివరకు కాంగ్రెస్(Congress) పార్టీకి పట్టం కట్టబెట్టారు. తనకు ఎదురే లేదని, తానే ప్రభుత్వమని, తాను ఏది చెబితే అది చెల్లుబాటు అవుతుందని విర్రవీగుతూ వచ్చిన అహంకారం తల దించుకునేలా చేశారు జనం. ఆకలితో ఉంటామని, అవసరమైతే బలిదానం చేసేందుకు సిద్దంగా ఉంటామని, కానీ తమ స్వేచ్ఛను హరించినా, ఆత్మ గౌరవానికి భంగం కలించాలని చూసినా ఊరుకునే ప్రసక్తి లేదని మరోసారి చాటి చెప్పారు తెలంగాణ ప్రజలు. ఒక రకంగా ఇది పాలకులకు, రాజకీయాలు చేసే నేతలకు గుణ పాఠంగా మిగిలి పోతుందని చెప్పడంలో సందేహం లేదు.
Congress Win Comment Viral
ప్రజలను ప్రేమించ లేని ఏ ఒక్కరినీ భరించే ప్రసక్తి లేదని పౌర సమాజం స్పష్టంగా ప్రకటించింది. పదేళ్ల పాటు సాగించిన దొరల, గఢీల పాలనకు చరమ గీతం పాడారు. ఇది ఊహించని పరిణామం. తనను తాను తెలంగాణ గాంధీగా , 80 వేలకు పైగా పుస్తకాలు చదివిన వాడిగా, సోషల్ ఇంజనీర్ గా , నయా నిజాం నవాబుగా తనను తాను ఊహించుకుంటూ వచ్చిన దొర కేసీఆర్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే చెంప ఛెళ్లుమనిపించారు. బలిదానాలు, ఆత్మహత్యల పునాదిగా ఏర్పడిన తెలంగాణ ఇవాళ నిటారుగా నిలబడింది. అధికారం ఉంది కదా అని జనం మీద దాడులకు తెగబడిన ప్రజా ప్రతినిధులకు తమ ఓటు అనే ఆయుధంతో విసిరి కొట్టారు. తాము ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు , నిధుల బదలాయింపు తమను గట్టెక్కిస్తాయని భావించిన గులాబీల నేతలకు గూబ గూయ్ మనిపించారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసిన బీఆర్ఎస్ బాస్ కు, ఆయన పరివారానికి జీవిత కాలమంతా గుర్తు పెట్టుకునేలా సంచలన తీర్పు ఇచ్చారు.
పవర్ అంటే కేవలం ఆధిపత్యానికో లేదా తమ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించు కునేందుకో అనుకుంటే పొరపాటు పడినట్టే. ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలని నిరూపించారు. తెలంగాణ యావత్ సమాజం మొత్తం దొరతనాన్ని సహించే ప్రసక్తి లేదని ఈ తీర్పుతో చాటి చెప్పింది. మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని , తెలంగాణ వనరులను పూర్తిగా ధ్వంసం చేయాలని అనుకున్న గులాబీ పరివారాన్ని బండకేసి కొట్టారు. ఇకనైనా చేసిన తప్పులను గుర్తించాలి. ఎక్కడ తప్పు చేశామో బేరీజు వేసుకోవాలి. లేకపోతే జనం తన్ని తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది. ప్రజలు బానిసలు కాదని తాము దట్టించిన తూటాలమని నిరూపించారు. కల్వకుంట్ల కుటంబం తమ భాషను మార్చుకోక పోతే సహించరని తెలుసుకోవాలి. లేకపోతే తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్న వారవుతారు. ఈ ప్రజా తీర్పు తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీకి వర్తిస్తుందని తెలుసు కోవాలి.
Also Read : CM KCR Resign : ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా