తెలంగాణలో శరవేగంగా రాజకీయాలు మారి పోతున్నాయి. దక్షిణాదిన పాగా వేయాలని ఆశించిన భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కర్ణాటకలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రజలు. మరోసారి పవర్ లోకి రావాలని ఆశించిన బీజేపీకి దిమ్మ తిరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా జల్లెడ పట్టినా చివరకు 65 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక తదుపరి ఎన్నికలు జరగాల్సి ఉంది తెలంగాణలో. దీంతో ఇక్కడైనా పాగా వేయాలని కంకణం కట్టుకుంది బీజేపీ.
ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంది. కన్నడ నాట వెలువడిన ఫలితాలే తెలంగాణలో కూడా సీన్ రిపీట్ కావడం ఖాయమని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ తరుణంలో ఇక్కడ కొలువు తీరిన భారత రాష్ట్ర సమితిలో కూడా కుదుపు మొదలైంది. ప్రభుత్వ వ్యతిరేకత భారీ ఎత్తున ఉండడంతో ఆ ఓటు బ్యాంకు చీలకుండా ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ బయటకు వచ్చారు. స్వంతంగా ఛాలెంజ్ చేసి మరీ గెలుపొందారు హుజూరాబాద్ లో.
ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీని ఎలా అధికారంలోకి తీసుకు రావాలనే దానిపై చర్చించేందుకే పార్టీ హైకమాండ్ ఈటల రాజేందర్ ను ఢిల్లీకి రావాలంటూ పిలుపు వచ్చినట్లు సమాచారం. ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకు వచ్చే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఆశించిన మేర నెరవేరలేదు. మరి ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
