Eknath Shinde : మాదే నిజమైన శివసేన పార్టీ – షిండే
ఉద్దవ్ ఠాక్రేకు అంత సీన్ లేదు
Eknath Shinde : మరాఠా రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే గవర్నర్ ఆస్పత్రి పాలయ్యారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే చేతులెత్తేశారు. ఇప్పటికే సీఎంఓను ఖాళీ చేసి తన మాతృశ్రీకి చేరుకున్నారు.
శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ సంక్షోభానికి కారణం కేంద్రంలోని మోదీ త్రయం అంటూ నిప్పులు చెరిగారు.
ఈ తరుణంలో శివసేన పార్టీకి చెందిన 12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్దవ్ ఠాక్రే డిప్యూటీ స్పీకర్ కు లేఖ రాశారు.
దీనిపై ఘాటుగా స్పందించారు శివసేన తిరుగుబాటు నాయకుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde). శివసేన పార్టీలో 40కి పైగా ఎమ్మెల్యేలు నా వైపు ఉన్నారు. నాకే మద్దతు ప్రకటించారు.
వారే కాదు మిగతా 10 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు సైతం నా శిబిరంలో ఉన్నారు. మేం ఎవరినీ బెదిరించ లేదు. అలా చేసినట్లు ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
ఇక ఉద్దవ్ ఠాక్రేకు ఏం అర్హత ఉందని తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతారని ప్రశ్నించారు. సీఎంకు అంత సీన్ లేదన్నారు. దీంతో ఏక్ నాథ్ షిండే చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
అనర్హత వేటు పేరుతో వారిని భయపెట్ట లేరని పేర్కొన్నారు. తన వర్గానిదే నిజమైన శివసేన అని మరోసారి స్పష్టం చేశారు ఏక్ నాథ్ షిండే. చట్టం మీకే కాదు మాకు కూడా తెలుసు అని తెలిపారు.
శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాలా సాహెబ్ ఠాక్రే నిజమైన వారసులం మేమేనని కుండ బద్దలు కొట్టారు షిండే.
Also Read : ముదిరిన మరాఠా రాజకీయ సంక్షోభం