హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ఏడాది క్రితం దివ్యా నగర్ లే ఔట్లో అడ్డుగోడలను తొలగించిన హైడ్రా మళ్లీ అక్కడే ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది. నాడూ నేడూ హైడ్రా ఆపరేషన్కు చిక్కింది విద్యా సంస్థల అధినేత నల్ల మల్లారెడ్డే కావడం గమనార్హం. ప్రభుత్వ భూమిలో అనుమతి లేని లే ఔట్తో ప్లాటింగ్ చేసి నల్ల మల్లారెడ్డి మళ్లీ హైడ్రాకు చిక్కాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్లాట్లుగా అమ్మేయడాన్ని సీరియస్ గా హైడ్రా పరిగణించింది. 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మడలం కాచవాణి సింగారం గ్రామం సర్వే నంబరు 66/2, 3, 4, 5లలో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
దీనికి ఆనుకుని లే ఔట్ వేసిన నల్ల మల్లారెడ్డి.. ప్రభుత్వ భూమిలోకి కూడా చొరబడి కొన్నిటిని ప్లాట్లుగా మార్చి అమ్ముకున్నారు. మొత్తం 6.12 ఎకరాల ప్రభుత్వ భూమిని తన ఆధీనంలో ఉంచుకున్నారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో హైడ్రా పరిశీలించింది. సర్వే ల్యాండ్ రికార్డుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. ఇందులో దాదాపు 50 వరకూ నల్ల మల్లారెడ్డి వేసిన ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇలా అక్కడ 6.12 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా విక్రయించడమే కాకుండా.. తమకు నోటీసులు ఇవ్వకుండా ఎలా కంచె వేస్తారని నల్ల మల్లారెడ్డి అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చుట్టూ ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
