నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియంలో జరిగిన తొలి కీలక మ్యాచ్ లో సూర్య భాయ్ నాయకత్వంలోని భారత జట్టు సత్తా చాటింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహించనుంది. ఇందుకు కీవీస్ తో సీరీస్ మ్యాచ్ లను సన్నాహకంగా భావిస్తోంది జట్టు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ తేలి పోయాడు. తను ఆశించిన పరుగులు చేయలేదు. కానీ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి రెచ్చి పోయాడు. వచ్చీ రావడంతోనే కీవీస్ బౌలర్ల భరతం పట్టాడు. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. 1-0 ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది. విదర్బ స్టేడియంలో పరుగుల వరద పారించారు బ్యాటర్లు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో దుమ్ము రేపారు. ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.
ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ 35 బంతుల్లో 84 పరుగులు చేశాడు. తను ఎనిమిది సిక్సర్లు కొట్టాడు. చివరకు రింకూ సింగ్ చెలరేగాడు. తను అజేయంగా 44 రన్స్ తో రాణించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇక పేలవమైన ఫామ్ తో నిన్నటి దాకా ఇబ్బంది పడుతూ వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ లో పర్వాలేదని అనిపించాడు. తను 39 పరుగులు చేశాడు. అబిషేక్ శర్మతో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే గ్లెన్ పిలిప్స్ 40 బంతుల్లో 78 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. వరుణ్ చక్రవర్తి బంతులతో తిప్పేశాడు.
