Inter Results: తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణా ఇంటర్ ఫలితాలు విడుదల

Inter Results : తెలంగాణా ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్… సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌ లో 66.89 శాతం, సెకండియర్‌ లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందని భట్టి చెప్పారు.

Telangana Inter Results Released

ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారని వెల్లడించారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని… రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాసైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.

విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ(Telangana) ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ www.tgbie.cgg.gov.inలో చూసుకోవచ్చని బోర్డు అధికారులు తెలిపారు. అలాగే ఈసారి ప్రతీ విద్యార్థి మొబైల్‌ ఫోన్‌ కు ఫలితాల లింక్‌ పంపనున్నట్లు వెల్లడించారు. లింక్‌ పై క్లిక్‌ చేసి హాల్‌ టికెట్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. గతంలో సర్వర్‌ డౌన్‌ లాంటి సమస్యలు ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసారి అలాంటి సాంకేతిక సమస్యలు ఎదురవకుండా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) ప్రత్యేక చర్యలు తీసుకుందని తెలిపారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంటర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

మరోవైపు ఫలితాల నేపథ్యంలో ఇంటర్‌ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య సోమవారం విద్యార్థుల మొబైల్‌ ఫోన్లకు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్‌) పంపారు. ‘పరీక్షల్లో జయాపజయాలు సహజం. ఫెయిలయ్యారనో, ఆశించిన విధంగా మార్కులు రాలేదనో నిరుత్సాహ పడవద్దు. మరింత శ్రమించండి… రెట్టింపు పట్టుదలతో పోరాడండి. విజయం మీ బానిస అవుతుంది’ అంటూ స్ఫూర్తిదాయక సందేశాన్ని పంపారు. ప్రతి విద్యార్థికీ ప్రత్యేక నైపుణ్యం ఉంటుందని, వారి ప్రతిభను కేవలం మార్కుల ఆధారంగా అంచనా వేయలేమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని, వారికి అండగా నిలబడాలని సూచించారు. ఫలితాల అనంతరం మానసిక ఆందోళనతో ఉన్న విద్యార్థులు టెలీమానస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 891 4416కు కాల్‌ చేయవచ్చని అన్నారు. కాగా, మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు హాజరయ్యారు.

Also Read : Karreguttalu: తెలంగాణా సరిహద్దులో హై ఎలర్ట్ ! కర్రెగుట్టను రౌండప్‌ చేసిన భద్రతా బలగాలు !

Leave A Reply

Your Email Id will not be published!