TTD Chairman : డ్రోన్ కెమెరాల కదలికలపై విచారణ
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ వైవీఎస్
TTD Chairman : గత కొంత కాలంగా తిరుమల నిత్యం వార్తల్లో ఉంటోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. భక్తులకు దర్శనం దగ్గరి నుంచి గదుల కేటాయింపు, అన్నదానం, లడ్డూ ప్రసాదాల వరకు అంతా వివాదాస్పదంగా మారింది.
కోట్లాది రూపాయల ఆదాయం, లెక్కించలేనంత బంగారం , ఇతర కానుకలు ఉన్నా పాలక మండలి వ్యవహారం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం చర్చకు దారితీసింది.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో డ్రోన్ కెమెరాల వ్యవహారం పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దీనిపై వివరణ ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
ఎక్కడా లేనంత భద్రత తిరుమలలో ఉంటుందని తెలిపారు. ఆగమ శాస్త్రం నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై విమానాలు, డ్రోన్లు సంచరించేందుకు వీలు ఉండదని , పూర్తిగా నిషేధం విధించడం జరిగిందని స్పష్టం చేశారు.
అయితే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వైరల్ గా మారిన డ్రోన్ కెమెరాల విజువల్స్ పై సమగ్రమైన విచారణకు ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారని వెల్లడించారు టీటీడీ చైర్మన్(TTD Chairman).
అయితే ఈ విజువల్స్ ను తీసిన వ్యక్తి హైదరాబాద్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోటోగ్రఫీ ద్వారా తీసిన ఫోటోలుగా విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారని చెప్పారు. అనేక కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని, ఒకవేళ కుట్ర కోణం ఉందేమోనన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఇది వాస్తవం కాదన్నారు టీటీడీ సీవీఎస్ వో కిషోర్.
Also Read : నరేంద్ర మోదీ బంగారు ప్రతిమ