# LVPrasad : త్రి భాషల్లో తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఎల్.వి.ప్రసాద్
LV Prasad, who acted in the first talkie films in three languages
LV Prasad : భారతీయ సినిమాకి నడకలు నేర్పిన సినీ పరిశ్రమ ప్రజ్ఞాశాలి, తెలుగు సినిమాకు క్లాసిక్ అనదగ్గ సినిమాలు అందించిన దర్శకుడు ఆయన. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, నటుడుగా సినీ నిఘంటువు లో తనకంటూ కొన్ని పేజిలు సృష్టించుకున్న ఉద్దండుడు. మొట్ట మొదటి హిందీ టాకీ చిత్రం ‘ఆలం అరా’తో పాటు తమిళ ‘కాళిదాస్’,తెలుగులో ‘భక్త ప్రహ్లద’ వంటి మూడు భాషల్లో తెరకెక్కిన తొలి టాకీ సినిమాల్లో నటించిన ఘనత ఎల్ .వి ప్రసాద్ సొంతం. దర్శకుడిగా 1949లో వచ్చిన ‘మన దేశం’ సినిమాతో ఎన్టీఆర్ను, ఆయనతో పాటు షావుకారు జానకి, సావిత్రి లాంటి గొప్ప నటులను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత వహించిన గొప్ప వ్యక్తి ఆయన. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా!?
భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించి నందుకు గాను దాదాసాహేభ్ ఫాల్కే అవార్డును అందుకున్న ఎల్.వి.ప్రసాద్(LV Prasad).
ఎల్.వి.ప్రసాద్ గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవరప్రసాద రావు తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు. ఎల్.వి. ప్రసాద్ చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేశారు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్ మరియూ భక్త ప్రహ్లాద మూడింటిలోనూ ఆయన నటించారు. తెలుగు వారిలో ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించారు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటం గానీ చేసారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో పల్నాటి యుద్దం’,‘ద్రోహి’,‘సంసారం’, ‘మిస్సమ్మ’, ‘అప్పు చేసి పప్పు కూడు’ తదితర ఆణి ముత్యాల లాంటి సినిమాలు అందించారు.
ఆయన జనవరి 17,1908 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఏలూరు తాలూకాలోని సోమవరప్పాడు గ్రామంలో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతుల రెండవ సంతానముగా జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టిన ప్రసాద్ గారాబంగా పెరిగారు. చురుకైన వారే అయినా చదువులో ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్ ను ఆకర్షించేవి. పాత అరిగి పోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శన శాలల్లో ప్రసాద్ తరచూ వాటిని ఆసక్తిగా చూసేవారు. స్థానిక నాటకాల్లో తరచుగా చిన్న చిన్న వేషాలు వేసేవాతు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై ఆసక్తిని పెంచి సినిమా రంగంలో ప్రవేశించ డానికి పునాదులు వేసింది.
1908 జనవరి 17న జన్మించిన ఎల్.వి.ప్రసాద్(LV Prasad) వివాహం సౌందర్య మనోహరమ్మతో జరిగింది. ఒకరోజు ఆయన సినిమాల్లో నటించాలనే కోరికతో జేబులో 100రూ.లతో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి ముంబయికి వెళ్లిన ఆయనకు ఎంతో కష్టపడగా చివరికి “ఆలం అరా” చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
ఆ చిత్రందేశంలోనే తొలి టాకీ సినిమా. అందులో ఎల్.వి.ప్రసాద్(LV Prasad) ఓ పాత్ర చేశారు. ఈ చిత్రంలో నటించినందుకు గాను ఎల్.వి.ప్రసాద్కు నెలకు 30 రూపాయలను అంద జేశారు. ముంబై వీనస్ ఫిల్మ్ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా జీవితాన్ని ప్రారంభించిన ప్రసాద్, శబ్ద చిత్రం “స్టార్ ఆఫ్ ది ఈస్ట్”లో చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత హెచ్.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం కాళిదాస, తెలుగు చిత్రం భక్త ప్రహ్లాదలో ఆయన నటించారు.
ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఎల్.వి.ప్రసాద్ 1950లో విడుదలైన విజయ పిక్చర్స్ వారి “షావుకారు” సినిమాకు “దర్శకత్వం” వహించి పేరు తెచ్చుకున్నారు. ఎన్టీ రామారావు, జానకి నటించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ప్రసాద్ ప్రొడక్షన్ను నెలకొల్పిన ఎల్.వి.ప్రసాద్ హిందీలో మిలన్, ఖిలోనా, ససురాల్, ఏక్ దూజే కె లియే వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.
1931లో ఆలం ఆరా – మొదటి హిందీ టాకీ సినిమా, 1931లో కాళిదాస్ – మొదటి తమిళ టాకీ సినిమా, 1931లో భక్తప్రహ్లాద – మొదటి తెలుగు టాకీ సినిమా, 1933 లో సీతా స్వయంవర్ (హిందీ), 1940లో బోండాం పెళ్ళి (తెలుగు), 1940లో చదువుకున్న భార్య, 1982లో రాజా పార్వాయి (తమిళం), చిత్రాలలో ఆయన నటించారు.
మిస్సమ్మ (1955), గృహ ప్రవేశం (1947), పల్నాటి యుద్ధం (1947), ద్రోహి (1948), మన దేశం (1949), సంసారం (1950), షావుకారు (1950) చిత్రాలకు దర్శకత్వం వహించారు.
జూన్ 22 1994లో ఈ లోకాన్ని వీడి వెళ్లినా, తన చిత్రాలతో ప్రేక్షకుల మదిలో కొలువై ఉన్నారు. ఎల్వీ ప్రసాదు స్మారకార్థం భారత తపాలా శాఖ 2006 సెప్టెంబరు 5న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
No comment allowed please