Minister Ramdas Athawale : కేంద్ర సర్కార్ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉంది
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు...
Minister Ramdas Athawale : తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే తెలిపారు. శనివారం నాడు మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే , మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ అథవాలే(Minister Ramdas Athawale) మాట్లాడుతూ… కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక, ఆర్థిక న్యాయం దిశగా ఉందని ఉద్ఘాటించారు. సబ్ కా సాత్ సబ్కా వికాస్ కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
Minister Ramdas Athawale Comment
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వ్యాఖ్యానించారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పేదలకు 3 కోట్ల ఇల్లు ఇచ్చామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని వివరించారు. దేశంలోని 85 శాతం మంది పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక్క ఎంపీ సీటు రాలేదని బీజేపీకి 8 ఎంపీలను ఇచ్చారని తెలిపారు. సౌత్ ఇండియాలో ఎన్డీయే మెజార్టీ స్థానాలు సాధించిందని.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేద్ రాష్ట్రాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని.. ఐదేళ్లు మోదీ నేతృత్వంలో పనిచేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ పార్టీ పనిచేస్తుందని రామదాస్ అథవాలే(Minister Ramdas Athawale) పేర్కొన్నారు.
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డి పోకున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. కేంద్రం రూ.26 వేల కోట్లను కేటాయించిందని రాష్ట్ర బడ్జెట్ సమావేశంలోనే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ అవగాహన లేకుండా కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నామని బట్టకాల్చి మీదేసి కాంగ్రెస్ సీట్లు పెంచుకుందని ఆరోపించారు. నెహ్రు తర్వాత మోదీ మూడేళ్లు వరుసగా ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. నాలుగోసారి గెలిచేందుకు మోదీ సర్కార్ ముందుకు సాగుతోందని వివరించారు. తెలంగాణ పేరు వచ్చిందా.. అని అడుగుతున్నారని.. సీఎం కొడంగల్కు కేటాయించిన నిధుల్లాగే మెదక్ నియోజకవర్గానికి కూడా రూ.4, 600 కోట్లు ఇవ్వాలి కదా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
Also Read : Hari Rama Jogaiah: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ !