MLA Harish Rao : భువనగిరి సభలో ప్రియాంక గాంధీ తో చెప్పించి ఇప్పుడు మాట మార్చారు
భువనగిరి సభలో ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమన్నారు...
Harish Rao : మాజీమంత్రి హరీష్ రావును ఆర్ఆర్ఆర్(RRR) బాధితులు, రైతులు శనివారం కలిశారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల హామీని కాంగ్రెస్ విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ సమస్యపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీయాలని హరీష్రావు(Harish Rao) ఆర్ఆర్ఆర్ బాధితులు కోరారు. ఈసందర్భంగా ఆర్ఆర్ఆర్ బాధితులతో హరీష్రావు(Harish Rao) మాట్లాడుతూ.. ఉత్తరదిక్కు ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తామన్నారు.
MLA Harish Rao Comments
భువనగిరి సభలో ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఆర్ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణనలోకి తీసుకోవడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మధ్య నుంచి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతోందన్నారు. బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నా ప్రభుత్వం కనికరించడం లేదని విమర్శించారు.
చౌటుప్పల్వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184 కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారని… దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కోమటి రెడ్డి.. బాధితులతో కలిసి ఆర్ఆర్ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారన్నారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గమన్నారు. రైతులను కాదని సర్వేలు నిర్వహించడం, వారిని భయబ్రాంతులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏమార్చడం, మోసం చేయడమని వ్యాఖ్యలు చేశారు.నాడు ఫార్మా సిటీ అన్నారని.. నేడు మాట మార్చి పచ్చటి పొలాల్లో చిచ్చు బెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారని.. నేడు మాట మార్చి నిర్బంధాల మధ్య భూసేకరణ కొనసాగిస్తున్నారన్నారు.
‘‘రేవంత్రెడ్డి గారూ.. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా’’ అని ప్రశ్నించారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీతో ఆర్ఆర్ఆర్ భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారని.. కానీ అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని.. వేధిస్తూ దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయని… లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దక్షిణ దిక్కున 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకున్నట్లుగానే, ఉత్తర భాగాన పరిగణలోకి తీసుకోవాలని రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తి కలిగేలా పరిహారం అందించి, వారి పూర్తి అంగీకారంతో భూ సేకరణ జరపాలని ఈ విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రోబోయే అసెంబ్లీ సమావేశాల్లో బాధితుల గొంతును వినిపిస్తామని.. ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. సమస్య పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.
Also Read : Virat Kohli : ఎంపైర్ పై నిప్పులు చెరిగిన కింగ్ కోహ్లీ