Mukesh Ambani: అయోధ్య రాముడికి ముకేశ్ అంబానీ కుటుంబం భూరి విరాళం !
అయోధ్య రాముడికి ముకేశ్ అంబానీ కుటుంబం భూరి విరాళం !
Mukesh Ambani: యావత్ ప్రపంచం ఎంతో ఆశక్తిగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిరంలోని రామ్ లల్లా (బలరాముని) విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అత్యంత వైభవోపేతంగా జరిగింది. భారతదేశం, హిందూ సమాజం తరపున వేద పండితుల సమక్షంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ ప్రాణ ప్రతిష్ఠ క్రతువును సాంప్రదాయ బద్ధంగా పూర్తి చేసారు. దేశం నలుమూల నుండి రాజకీయ, సినీ, వ్యాపార, ఆధ్యాత్మిక ప్రముఖులు అయోధ్యకు చేరుకుని ఈ క్రతువును ప్రత్యక్షంగా తిలకించగా… కోట్లాది మంది భారతీయులు, హిందూ సమాజం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ అపురూప ఘట్టాన్ని చూసి తరించింది. ఈ వేడుకకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్య రామ మందిరానికి భారీ భూరీ విరాళం ఇచ్చారు. అయోధ్య రామ మందిరం ట్రస్టుకు రూ. 2.51 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ మొత్తాన్ని రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు విరాళంగా అందజేశారు.
Mukesh Ambani Visit
సోమవారం అయోధ్య వేదికగా జరిగిన రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు… ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ తన సతీమణి నీతా అంబానీ, కుమార్తె ఇషా, అల్లుడు ఆనంద్ పిరామల్, కుమారులు ఆకాశ్, అనంత్తో పాటు కోడలు శ్లోకా మెహతా, కాబోయే కోడలు రాధికా మర్చంట్ లతో కలిసి హాజరయ్యారు. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రామ మందిరం బయట ఫోటోలు తీసుకుని అంబానీ కుటుంబం సందడి చేసింది. అంబానీ కుటుంబంతో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ… శ్రీరాముడు ఈరోజు వచ్చేస్తున్నాడు… దేశం మొత్తానికి ఈ రోజు రామ్ దీపావళి అని వ్యాఖ్యానించారు. ఇదో చారిత్రక రోజు అని నీతా అంబానీ అన్నారు. ఇది చరిత్రలో లిఖించదగిన రోజు అని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వ్యాఖ్యానించగా… అత్యంత పవిత్రమైన ఈ రోజున తాను ఇక్కడ ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈషా అంబానీ తెలిపారు.
Also Read : Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 రూట్ మ్యాప్ ఖరారు !