రాష్ట్రంలో ఇక రాజా రెడ్డి రాజ్యాంగం చెల్లదన్నారు టీడీపీ సీనియర్ నేత నారా లోకేష్. ఆయన యువగళం పాదయాత్ర సందర్భంగా నందికొట్కూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శుక్రవారం తుమ్మలూరులో ఆగారు. రైతులను , మహిళలను పరామర్శించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు నారా లోకేష్. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందన్నారు. ఇక నుంచి రాజా రెడ్డి రాజ్యాంగం ఉండదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర హైకోర్టు ఇవాళ కీలకమైన తీర్పు వెలువరించిందని అన్నారు. అమరావతి జీవో నెంబర్ 1ని కొట్టి వేస్తూ తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఈ జీవో ఉందని మండిపడింది. రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెంబర్ 1ని తీసుకు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. రోడ్ షోలను కట్టడి చేసేలా ఉందన్న పిటిషన్ల న్యాయవాది ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారని వాదించారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఏపీ సీఎం జగన్ రెడ్డికి చెంప పెట్టు లాంటిదని ఎద్దేవా చేశారు టీడీపీ నేత నారా లోకేష్. రేపో మాపో ఏపీ సీఎం జైలుకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు.
