Rajnath Singh: ఇంధనం లేక నిలిచిపోయిన రక్షణ మంత్రి హెలికాప్టర్ ! రోడ్డు మార్గంలో రక్షణ మంత్రి !
ఇంధనం లేక నిలిచిపోయిన రక్షణ మంత్రి హెలికాప్టర్ ! రోడ్డు మార్గంలో రక్షణ మంత్రి !
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వినియోగిస్తున్న హెలికాప్టర్కు ఇంధనాన్ని తిరిగి నింపలేకపోవడంతో ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటన ఝార్ఖండ్ లోని గఢ్వాలో జరిగింది. రాజ్నాథ్ సింగ్ శనివారం బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రసంగించేందుకు హెలికాప్టర్లో గఢ్వా సమీప బంశీదర్ నగర్ కు వచ్చారు. అనంతరం ఆయన ఉత్తర్ప్రదేశ్లోని వారణాసికి వెళ్లాల్సి ఉంది.
అయితే, హెలికాప్టర్కు అవసరమైన ఇంధనాన్ని తీసుకొస్తున్న వాహనం సకాలంలో అక్కడకు చేరుకోలేదు. దాదాపు గంట సమయంపాటు వేచి ఉన్న రక్షణ మంత్రి అక్కడి నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న వారణాసికి రహదారి మార్గంలో బయలుదేరారు. ఆయన వెంట కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు. రక్షణ మంత్రి వినియోగించిన హెలికాప్టర్ ఓ ప్రైవేటు సంస్థదని, దానికి అవసరమైన ఇంధనం తీసుకొస్తున్న ట్యాంకర్ మధ్యలో నిలిచిపోవడంతో సమస్య తలెత్తిందని ఝార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు.