PNS Ghazi: విశాఖ తీరంలో పాక్‌ సబ్ మెరైన్ ‘ఘాజీ’ శకలాలు !

విశాఖ తీరంలో పాక్‌ సబ్ మెరైన్ 'ఘాజీ' శకలాలు !

PNS Ghazi: తూర్పు తీరంలో పాకిస్థాన్ కు చెందిన సబ్ మెరైన్ ‘ఘాజీ(PNS Ghazi)’ శకలాలను… ఇండియన్ నేవీ తాజాగా గుర్తించింది. ఇండియన్ నేవీకు చెందిన ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’ (డీఎస్‌ఆర్‌వీ) ఈ శకలాలను గుర్తించింది. ఈ శకలాలు 1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి దొంగచాటుగా ప్రవేశించిన పీఎన్‌ఎస్‌ ఘాజీకి చెందినవిగా తేల్చింది. ఇదే విషయాన్ని ఇండియన్ నేవీ సబ్‌ మెరైన్‌ రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ధ్రువీకరించారు.

ఇండియన్ నేవీలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇటీవల ప్రవేశపెట్టిన ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’ (డీఎస్‌ఆర్‌వీ) సహాయంతో ఈ శకలాలను గుర్తించాం. విశాఖ తీరానికి సమీపంలో కొన్ని నాటికల్‌ మైళ్ల దూరంలోనే సముద్ర గర్భాన ఈ ఘాజీ(PNS Ghazi) శకలాలు ఉన్నాయి. యుద్ధంలో చనిపోయిన వారిని గౌరవించడం మన ఇండియన్ నేవీ ఆచారం. అందువల్ల ఆ శకలాలను తాకలేదు’’ అని ఆ నేవీ అధికారి పేర్కొన్నారు. ఈ ఘాజీ శకలాలు విశాఖ తీరానికి 2 నుండి 2.5 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో 100 మీటర్ల లోతున ఉన్నట్లు తెలుస్తోంది.

PNS Ghazi – డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీ అంటే ఏమిటీ ?

2013లో ముంబై తీరంలో ఐఎన్‌ఎస్‌ సింధ్‌ రక్షక్‌ ప్రమాదానికి గురై 13 మంది నేవీ అధికారులు, సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన ఇండియన్ నేవీ ఇటువంటి సమయంలో సిబ్బందిని రక్షించేందుకు వీలుగా 2018లో తొలిసారి డీఎస్‌ఆర్‌వీ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ప్రమాదానికి గురై సముద్ర గర్భంలో ఉన్న నౌకలు, సబ్‌ మెరైన్లను గుర్తించి సహాయక చర్యలు చేపట్టేందుకు ఈ ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’ ని వాడాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇండియన్ నేవీ వద్ద రెండు డీఎస్‌ఆర్‌వీలు ఉండగా వాటిలో ఒకటి తూర్పు, మరొకటి పశ్చిమ తీరంలో వాడుతున్నారు. ఇటువంటి ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’ ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ సహా 12 దేశాల వద్ద మాత్రమే ఉంది.

సముద్ర గర్భం లోతుకు వెళ్లే కొద్దీ ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. డీఎస్‌ఆర్‌వీకి 650 మీటర్ల దిగువకు వెళ్లి పనిచేసే సామర్థ్యం ఉంది. వైజాగ్‌లోని హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఇలాంటివి మరో రెండింటిని దేశీయంగా తయారు చేయడంపై భారత్‌ దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఈ ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’… సముద్ర జలాల కింద ఉపరితలం ఎలా ఉందో అంచనావేసి… మన జలాంతర్గాములు ప్రయాణించేందుకు అనువైన మార్గాలను డీఎస్ఆర్‌వీ సాయంతో మ్యాపింగ్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో విశాఖ తీరంలో సబ్ మెరైన్ మార్గాలను అన్వేషిస్తుండగా ఘాజీ శకలాలను ఇది గుర్తించినట్లు తెలుస్తోంది.

పిఎన్ఎస్ ఘాజీ చరిత్ర ఎంటో తెలుసా ?

అమెరికా నౌకాదళానికి చెందిన టెన్చ్‌ శ్రేణికి చెందిన డీజిల్‌ ఎలక్ట్రిక్‌ సబ్‌మెరైన్‌ ఈ పీఎన్‌ఎస్‌ ఘాజీ. దీనిని యూఎస్‌ఎస్‌ డయాబ్లోగా పిలుస్తారు. 1963లో అమెరికా దీనిని పాకిస్థాన్ కు లీజుకు ఇచ్చింది. ఇస్లామాబాద్‌ నౌకాదళంలో చేరిన తొలి అటాక్‌ సబ్‌మెరైన్‌ ఇదే కావడం విశేషం. అయితే విశాఖ తీరంలో సముద్రం సగటున 16 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఓడలు నిలిపేందుకు అనుకూలం. అంతేకాదు… సబ్ మెరైన్స్ తీరం సమీపంలోకి వచ్చి వెళ్లేందుకు వీలవుతుంది. విశాఖ తీరం గురించి తెలుసుకున్న పాకిస్థాన్… 1971లో భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఈ పీఎన్‌ఎస్‌ ఘాజీను విశాఖ తీరానికి తరలించింది.

1971 నవంబర్‌ 14న కరాచీ పోర్టు నుండి బయలుదేరిన ఈ ఘాజీ(PNS Ghazi) సబ్ మెరైన్… సుమారు 3,000 కి.మీ. పైగా ప్రయాణించి శ్రీలంక మీదుగా విశాఖ తీరానికి చేరి నక్కింది. భారత్‌ వద్ద ఉన్న ఏకైక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ను ధ్వంసం చేయాలన్నది ఈ పిఎన్ఎస్ ఘాజీ ప్రధాన వ్యూహం. అయితే ఘాజీ ఎత్తుగడను ముందే పసిగట్టిన ఇండియన్ నేవీ అధికారులు…. విక్రాంత్‌ ను అండమాన్‌ దీవుల వద్దకు తరలించారు.

ఆ స్థానంలో వైజాగ్‌ తీరం నుంచి డెకాయ్‌ గా ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌ ను పంపారు. అది విమానవాహక నౌక వలే భారీ సిగ్నల్స్‌ వదలడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో విక్రాంత్‌ లోని సిబ్బందిలా ఒకరు తన జబ్బుపడిన తల్లికి టెలిగ్రాం పంపినట్లుగా కావాలనే భద్రతా ప్రొటోకాల్‌ ను ఉల్లంఘించారు. దీనిని ఘాజీ పసిగట్టి… రాజ్‌ పుత్‌ నే విక్రాంత్‌ గా భ్రమించి దాడికి సిద్ధమైంది. డిసెంబర్‌ 3 అర్ధరాత్రి సముద్రంలో అలజడిని రాజ్‌ పుత్‌ గుర్తించింది. దానికి కారణం ఘాజీ సబ్‌ మెరైన్‌ గా నిర్ధరించుకొని… అక్కడ రెండు ఛార్జెస్‌ ను నీటిలోకి వదిలింది. అదే సమయంలో జలాల్లో భారీ పేలుడు జరిగి ఘాజీ మునిగిపోయింది.

దీనితో పిఎన్ఎస్ ఘాజీలో ఉన్న దాదాపు 92 మంది పాకిస్థాన్ నేవీ అధికారులు, సిబ్బంది చనిపోయారు. ఈ ఘటన పాకిస్థాన్ నేవీకి కోలుకోలేని దెబ్బగా మారింది. అయితే పాకిస్థాన్ మాత్రం అంతర్గత పేలుడు వల్లే ఘాజీ సబ్ మెరైన్ మునిగిపోయినట్లు ఇప్పటికీ చెబుతోంది. ఈ పిఎన్ఎస్ ఘాజీ(PNS Ghazi) శకలాలు ఇప్పటికీ విశాఖ తీరంలో సముద్రం అడుగున కూరుకుపోయి ఉన్నాయి. తాజాగా వాటిని ఇండియన్ నేవీకు చెందిన ‘ది డీప్‌ సబ్‌మెర్జెన్స్‌ రెస్క్యూ వెహికల్‌’ గుర్తించింది.

Also Read : MP Raghu Rama Krishna Raju : ముఖ్యమంత్రి జగన్ కొత్త హెలికాఫ్టర్లపై ఎంపీ సిఈసి కి పిర్యాదు

Leave A Reply

Your Email Id will not be published!