Statue Of Equality : హైదరాబాద్ లోని ముచ్చింతల్ జై శ్రీమన్నారాయణ నినాదాలతో మారుమ్రోగుతోంది. శ్రీరామనగరం భక్తులతో అలరారుతోంది. సమతా కేంద్రంలోని సమతామూర్తిని(Statue Of Equality)దర్శించుకునేందుకు భక్త బాంధవులు పోటీ పడుతున్నారు.
ప్రముఖల రాక పోకలతో ఆ ప్రాంగణం అంతా దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు(Statue Of Equality) నభూతో నభవిష్యత్ అన్న రీతిలో కొనసాగుతున్నాయి.
వేద మంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మి నారసింహుడి స్త్రోత్రాలతో దద్దరిల్లుతోంది ఆ ప్రాంగణమంతా. యాగాలు, యజ్ఞ క్రతువులు , విశేష పూజలతో ఆధ్యాత్మిక సౌరభవంతో అలరారుతోంది.
ఈనెల 2న ప్రారంభమైన ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఇవాళ 12వ రోజు. ఇప్పటి దాకా దేశంలోని ప్రముఖులంతా ఇక్కడికి వేంచేశారు. స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.
ఈనెల 5న సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. జాతికి అంకితం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దర్శించుకున్నారు.
ఏపీ, తెలంగాణ, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్ , శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు గవర్నర్లు తమిళి సై సౌందర రాజన్ , హరిభూషన్ , బండారు దత్తన్నతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు.
వీరితో పాటు సినీ స్టార్లు పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , చిరంజీవి సైతం ఇక్కడికి విచ్చేశారు. ఈ అద్భుత కళా వైభవాన్ని చూసి తరించారు. ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముచ్చింతల్ కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Also Read : సమతామూర్తి మహా అద్భుతం