TTD: రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరుకి టీటీడీ ప్రతిపాదన
రేణిగుంట ఎయిర్ పోర్టుకు శ్రీవారి పేరుకి టీటీడీ ప్రతిపాదన
రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని… ఈ పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ ముగిసింది. ఈ భేటీ అనంతరం సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ‘‘బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శ్రీవారి ఆలయం చిన్నగా ఉంది. పెద్ద ఆలయం నిర్మించాలని డీకే కోరారు. స్థలం కేటాయించగానే ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
టీటీడీకు 100 విద్యుత్ బస్సులు కేటాయిస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. టీటీడీ ఉచిత ఎలక్ట్రిక్ బస్సుల వల్ల తిరుమలలో భక్తులకు ఉచిత రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. తిరుపతిలో సీఎస్ఐఆర్ పెద్ద ల్యాబ్ ఏర్పాటు కానుంది. ల్యాబ్ నిర్మాణానికి స్థలం లీజు పద్ధతిలో కేటాయించాలని నిర్ణయించాం. ఈ ల్యాబ్ ద్వారా నెయ్యి, నీరు, పప్పుధాన్యాల నాణ్యతను అధికారులు పరిశీలిస్తారు. సమరసత్తా ఫౌండేషన్ సహకారంతో అర్చక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. టీటీడీకి చెందిన ఏడు పాఠశాలల్లో దాదాపు 1600 మంది విద్యార్థులకు మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తాం. టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు సనాతన ధర్మం, తెలుగు సాంస్కృతిక వైభవంపై శిక్షణ ఇవ్వడానికి మన వారసత్వం పేరుతో కార్యక్రమం చేపడుతున్నాం. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన సౌభాగ్యం పేరుతో తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి’’ అని తితిదే ఛైర్మన్ తెలిపారు. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.