Pawan Kalyan : పొత్తుకు సిద్దం కాదంటే ఒంటరి పోరాటం
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan : జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మంగళవారం ఆయన ఎన్నికల సందర్భంగా ప్రారంభించబోయే వారాహి ప్రచార రథానికి కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు చేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు లాంటివని అన్నారు.
పొత్తులపై ఎన్నికల సమయంలో తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఒకవేళ పొత్తులు కుదరక పోతే ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు చీలి పోకూడదని తన అభిప్రాయమని స్పష్టం చేశారు.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని , ప్రభుత్వ పనితీరు పట్ల ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. వాళ్లకు అధికార బలం ఉంటే తనకు కోట్లాది మంది ప్రజాబలం ఉందన్నారు. మీ ఆదరాభిమానాలే తనకు శక్తిని ఇస్తాయని చెప్పారు. ప్రజల కోసం, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. సంపాదించు కునేందుకు, వ్యాపారాలు చేసేందుకు కాదన్నారు.
తెలంగాణ తనకు పునర్జన్మ ఇచ్చిందని కొనియాడారు. కొండగట్టు అంజన్న ఆశీస్సులతోనే తాను గతంలో ప్రమాదం నుంచి బయట పడ్డానని గుర్తు చేసుకున్నారు. అందుకే ఇక్కడి నుంచే తన ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan). తెలంగాణలో కూడా జన సేన పోటీ చేస్తుందని వెల్లడించారు. సామాన్యులు, పేదలు, అణగారిన వర్గాల తరపున జనసేన ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల ఐక్యత కోసం పని చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్.
Also Read : అంజన్న సన్నిధిలో జనసేనాని