కన్నడ నాట ఎన్నికల సంగ్రామం ముగిసింది. మే 13న శనివారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం 224 సీట్లకు గాను 2,516 అభ్యర్థులు బరిలో ఉన్నాయి. ఈ సందర్బంగా పోలింగ్ ముగిసిన అనంతరం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. బొమ్మై సీఎంగా దిగి పోవడం ఖాయమన్నారు. తమ పార్టీకి 224 సీట్లలో 141 సీట్లు రావడం పక్కా ని స్పష్టం చేశారు కేపీసీసీ చీఫ్.
పోలింగ్ అనంతరం 10 ఛానళ్లు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇందులో రెండు ఛానళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. కేవలం ఒకే ఒక్క ఛానల్ మాత్రం భారతీయ జనతా పార్టీ పవర్ లోకి తిరిగి వస్తుందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఏడు ఛానళ్లు, సంస్థలు మాత్రం కర్ణాటకలో హంగ్ ఏర్పడడం ఖాయమని ప్రకటించాయి. హెచ్ డీ కుమార స్వామి సారథ్యంలోని జేడీఎస్ కీలకమైన పాత్ర పోషించనుందని జోష్యం చెప్పాయి.
ఈ సందర్భంగా డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. తమకు ఆధిక్యం రావడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రస్తుత బొమ్మై ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలో తాము సక్సెస్ అయ్యామని చెప్పారు. దీంతో ప్రజలు మార్పు కోరుకున్నారని ఇది పోలింగ్ లో స్పష్టమైందన్నారు డీకే శివకుమార్.
