Youtuber Jasbir Singh: యూట్యూబర్ జస్బీర్ ఫోన్ లో 150 పాకిస్తానీయుల నెంబర్లు ?
యూట్యూబర్ జస్బీర్ ఫోన్ లో 150 పాకిస్తానీయుల నెంబర్లు ?
గూఢచర్యం కేసులో అరెస్టయిన పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్ కు కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రిమాండ్ లో ఉన్న అతడి నుంచి పంజాబ్ పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అతడి ఫోన్లో పాక్కు చెందిన సుమారు 150 నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఇప్పటివరకు ఆరు సార్లు పాకిస్థాన్ను సందర్శించినట్లు విచారణలో తేలింది. గూఢచర్య నెట్వర్క్ కు సూత్రధారి అయిన పాక్కు చెందిన మాజీ పోలీసు అధికారి గురించి జస్బీర్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
నాసిర్ ధిల్లాన్ పాక్కు చెందిన మాజీ సబ్ ఇన్స్పెక్టర్. ఇతడు గూఢచర్యం వ్యవహారాల్లో సూత్రధారిగా ఉన్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ధిల్లాన్ కు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐ అధికారులకు జస్బీర్ను పరిచయం చేసింది ధిల్లానే. పాక్ కు గూఢచర్యం కేసులో ఇటీవల అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో కలిసి 10 రోజులు లాహోర్ లో ఉన్నట్లు జస్బీర్ విచారణలో పేర్కొన్నాడు. ఆ సమయంలో ధిల్లాన్ భారత్ యూట్యూబర్లను పాక్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్కు పరిచయం చేశాడు. అక్కడ డానిష్ గూఢచర్యం గురించి వారికి వివరించాడు. కాగా… భారత్ యూట్యూబర్లను గూఢచర్యంలోకి లాగే వ్యవహారంలో పాక్కు చెందిన అనేక మంది మాజీ పోలీసులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
‘జాన్ మహల్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జస్బీర్… తన లాప్టాప్ను ఒక గంట పాటు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారికి ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. ఇతర గూఢచారుల మాదిరిగానే జస్బీర్ కూడా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్తో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసు అధికారులు గుర్తించారు. తన మిత్రురాలి ద్వారా డానిష్ తో పరిచయం ఏర్పడినట్లు జస్బీర్ పంజాబ్ కోర్టులో తెలిపాడు. డానిష్ తనకు కొన్ని సిమ్ కార్డులు పంపించాలని ఆదేశించినట్లు చెప్పాడు. పాక్కు గూఢచర్యం కేసులో ఇటీవల యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు తర్వాత ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో పని చేస్తున్న డానిష్పై అనుమానాలు బలపడడంతో అతడిని దేశం నుంచి బహిష్కరించారు. యూట్యూబర్ల తీగ లాగే క్రమంలో జస్బీర్ కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే.
పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈక్రమంలోనే పాక్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో ‘జాన్ మహల్’ అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న జస్బీర్సింగ్ను అధికారులు అరెస్టు చేశారు. డానిష్తో పాటు, పాక్కు చెందిన మరికొందరు అధికారులతో జస్బీర్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. 2020, 21, 24లలో శత్రుదేశంలో పర్యటించాడు. ఇక, పాకిస్థాన్ నిఘా సంస్థలకు భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టయిన సంగతి తెలిసిందే.