తామే తెలంగాణ రాష్ట్రంలో ఓ ఫోర్స్ గా మారామని స్పష్టం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదన్నారు. ఇంకే పార్టీలోనూ విలీనం చేయబోమంటూ చెప్పారు. బయట జరుగుతున్నప్రచారాన్ని నమ్మవద్దని కోరారు షర్మిల.
తాము ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నామని , కానీ మిగతా పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. తాను ఒక్కదాన్నే సీఎం కేసీఆర్ ను, ఫ్యామిలీని, ఆయన చేసే మోసాలను ఎండగడుతున్నానని ఏ ఒక్క నాయకుడైనా ప్రశ్నించాడా అని నిలదీశారు వైఎస్ షర్మిల.
ఇదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఇందులో తప్పేముందన్నారు. నాయకత్వం ఒక్క రోజులో బయట పడేది కాదని పేర్కొన్నారు షర్మిల. కాలంతో పాటు వచ్చే విశ్వసనీయత ఆధారంగా లీడర్ షిప్ బలపడుతుందని చెప్పారు. కర్ణాటకలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమన్వయంతో కష్టపడి పని చేశారంటూ కితాబు ఇచ్చారు.
కాబట్టే జనం నమ్మారని, మత రాజకీయాలను ఈడ్చి కొట్టారంటూ ఎద్దేవా చేశారు. వారంతా దివంగత తమ తండ్రి వైఎస్ఆర్ ను ఆదర్శంగా తీసుకున్నారని స్పష్టం చేశారు. అందుకే పవర్ లోకి వచ్చారని చెప్పారు. కానీ ఇదే సమయంలో ఎమ్మెల్యేలను మ్యానేజ్ చేయలేక పోతున్నారని ఇదే ఆ పార్టీకి తీరని సమస్య అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
