YS Sharmila : అమ్ముడు పోయిన ఆ పార్టీలకు హక్కు లేదు
నిప్పులు చెరిగిన వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె సీఎం కేసీఆర్ ను, కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ప్రజా ప్రస్థానం పేరుతో తెలంగాణలో చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె చేపట్టిన యాత్ర ములుగు జిల్లాలో నడుస్తోంది. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి షర్మిల(YS Sharmila) ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పార్టీలు మౌనంగా ఎందుకు ఉన్నాయంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కేసీఆర్ చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎందుకు నిలదీయడం లేదంటూ నిప్పులు చెరిగారు. ఆ పార్టీలు దొరకు అమ్ముడు పోయాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఓ వైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే సోయి లేకుండా ఫామ్ హౌస్ లో ఎలా పడుకుంటారంటూ మండిపడ్డారు షర్మిల. పూర్తిగా మాయ మాటలు చెబుతూ ఇంత కాలం ప్రజలను మోసం చేశాడని సీఎంపై ధ్వజమెత్తారు.
మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేస్తానని ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చ లేదంటూ నిప్పులు చెరిగారు. ఎనిమిదేళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు అమలు చేయలేదన్నారు. కేసీఆర్ కు దాచు కోవడం, దోచుకోవడం మాత్రమే తెలుసని కానీ పాలించడం చేత కాదన్నారు.
ఇంకా పది నెలల ముందే ఎన్నికలకు మళ్లీ సిద్దం అయ్యేందుకు పావులు కదుపుతున్నాడని రాజకీయం చేయడం తప్ప ప్రజలకు ఇంత వరకు చేసింది ఏమీ లేదన్నారు వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 70 వేల కోట్ల అవినీతికి పాల్పడినా ఒక్క నాయకుడు కూడా నోరు ఎందుకు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : వివక్ష నిజం గవర్నర్ ఆగ్రహం
