Lokesh Yuva Galam Comment : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్ జగన్ రెడ్డి సర్కార్ తమకు ఢోకా లేదని అంటోంది.
తాము చేపట్టిన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని ధీమాతో ఉన్నారు. కానీ తెలుగుదేశం , జనసేన, బీజేపీ , ఇతర పార్టీలు మాత్రం వైసీపీకి అంత సీన్ లేదని, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రాబోయే కాలం తమదేనంటున్నాయి.
ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వస్తున్న తెలుగుదేశం పార్టీ నిత్యం ప్రజా సమస్యలను ఎత్తి చూపేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చింది.
ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు. సీఎంను నిలదీస్తున్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మరో వైపు తనయుడు నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అటో ఇటో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.
400 రోజులు 4,000 వేల కిలోమీటర్ల పాదయాత్రకు(Lokesh Yuva Galam) శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర తన తండ్రికి కంచుకోటగా పేరొందిన కుప్పం నియోజకవర్గం నుంచే ప్రారంభించనున్నారు. ఇందు కోసం జనవరి 27న ముహూర్తం కూడా ఖరారు చేశారు.
దీనిపై సర్కార్ అభ్యంతరం తెలిపింది. కానీ కోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే పోలీసులు 14 షరతులతో పాదయాత్రకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్దం చేశారు.
కలిసి వచ్చే పార్టీలతో కలుపుకుని ఎలాగైనా సరే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో తండ్రీ , కొడుకులు రాజకీయ రణ రంగంలోకి దూకారు. ఇందు కోసం నారా లేకేశ్ తాను చేపట్టే పాదయాత్రకు యువ గళం అని పేరు పెట్టారు.
పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఆయన వెంట ఉండనున్నారు. భావ సారూప్యత కలిగిన వివిధ వర్గాలకు చెందిన వారు కూడా లోకేశ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొననున్నారు.
ఈ యువగళం పాదయాత్ర ఏపీలోని 100 నియోజకవర్గాలలో కొనసాగుతుంది. ఈ యాత్రకు సంబంధించి అన్నీ తానై చూసుకుంటున్నారు సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడు. ఎలాంటి హంగు, ఆర్భాటం లేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
దారి పొడవునా ఈ పాదయాత్రలో మహిళలు, యువతీ యువకులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చింది పార్టీ ఇప్పటికే.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నారా లోకేశ్(Lokesh Yuva Galam) వింటారు. వారు అందించే సూచనలు, అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. తన యువగళం పాదయాత్రలో ఎదురైన అనుభవాల ఆధారంగా మేనిఫెస్టో రూపొందించనున్నట్లు సమాచారం.
ఆనాడు తమ సర్కార్ సమయంలో జగన్ కు పూర్తి భద్రత కల్పించాలని , ఇప్పుడు తమ యువ గళంకు కూడా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉంటుందన్నారు అచ్చెన్నాయుడు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ ప్రధానంగా ఏపీ సర్కార్ ను ఎండగట్టనున్నారు మూడున్నర ఏళ్ల కాలంలో యువతకు జాబ్స్ లేక పోవడం, మహిళలకు సెక్యూరిటీ ఇవ్వక పోవడం, పరిశ్రమలు ఏర్పాటు కాక పోవడం, తదితర సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు.
తాము పవర్ లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇవ్వనున్నారు. లోకేశ్ యువ గళం పార్టీకి మరింత బలాన్ని ఇవ్వబోతుందని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి ఈ యాత్ర ప్రభంజనం సృష్టిస్తుందా అన్నది వేచి చూడాలి.
Also Read : భారత ఆర్కిటెక్ట్ బీవీ దోషి కన్నుమూత