PM Narendra Modi: పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ
PM Narendra Modi : అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోన్న పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత మొత్తాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వారణాసి నుంచి విడుదల చేశారు. సేవాపురిలోని బనౌలిలో జరిగిన కార్యక్రమంలో ఈ విడతను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈసారి దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ.20,000 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. అంటే, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అంతకుముందు, జూన్ 18, 2024న, ప్రధానమంత్రి మోదీ నుంచి రూ.9.26 కోట్ల మంది రైతుల ఖాతాలకు సమ్మాన్ నిధిని రిలీజ్ చేశారు.
PM Narendra Modi Released
వారణాసి పర్యటనలో భాగంగా మోదీ (PM Narendra Modi) దాదాపు రూ.2,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్లు, ఆసుపత్రులు, స్కూళ్లు సహా రకరకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు వారణాసి ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుచనున్నాయి. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కూడా పెంచబోతున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు రైతుల జీవితాలు, గ్రామీణ భారతాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. రైతులకు ఏటా ఒక్కోవిడత రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేల సాయం అందించే ‘పీఎం కిసాన్’ (PM Kisan) పథకాన్ని కేంద్రం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 19 వాయిదాల్లో రూ.3.46 లక్షల కోట్లు అందజేసింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ… మీరు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు. మీ సంక్షేమం కోసం మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. రైతులకు నగదు విడుదల చేసిన సందర్భంగా మరో పథకం గురించి కూడా మోదీ ప్రస్తావించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. ఈ పథకం ద్వారా పంటకు నష్టం జరిగితే బీమా సంస్థ పరిహారం ఇస్తుందని గుర్తు చేశారు. ఈ స్కీం ద్వారా ఇప్పటివరకు రైతులకు రూ.1.75 లక్షల కోట్లకు పైగా విలువైన క్లెయిమ్లు ఇచ్చినట్లు ప్రస్తావించారు. పంట బీమా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలన్నారు.
‘పీఎం కిసాన్’ పథకం డబ్బు ఖాతాలో జమయ్యిందా ? తెలుసుకోండిలా ?
ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
కుడి వైపున కనిపిస్తున్న ఆప్షన్లలో బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్ ఉంటుంది.
సెలక్ట్ చేసుకున్న తర్వాత ఖాతా నెంబరును ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘గెట్ డేటా’ పై క్లిక్ చేయాలి.
స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఒకవేళ మీరు పీఎం కిసాన్కు రిజిస్టర్ చేసుకొని, ఈ-కేవైసీ పూర్తిచేసి ఉంటే ఖాతాలోకి డబ్బు జమవుతుంది.
అలాగే లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో.. కూడా చెక్ చేసుకోవచ్చు.
బెనిఫిషియరీ స్టేటస్ కింద బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఆప్షన్పై క్లిక్ చేస్తే మరొక పేజీకి రీడైరెక్ట్ అవుతుంది.
ఇక్కడ లబ్ధిదారుడి రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాలను ఎంచుకొని ‘గెట్ రిపోర్ట్’పై క్లిక్ చేస్తే లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
పీఎం కిసాన్ హెల్ప్లైన్ నెంబరు 155261 / 011-24300606 కు కాల్ చేసి కూడా సమాచారం తెలుసుకోవచ్చు.
Also Read : Bihar: బిహార్ లో 65 లక్షల ఓటర్లు ‘మిస్సింగ్’ ?
