తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాణ దాన ట్రస్టుకు రూ. 2.50 కోట్లు విరాళం అందింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ విరాళాన్ని అందించింది. ఈ విషయాన్ని టీటీడీ సహాయ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (అడిషనల్ ఈవో) వెంకయ్య చౌదరి వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ నిర్మాణ సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు ఈ భారీ విరాళాన్ని అందించింది. సదరు సంస్థ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, శ్రీ వెంకటేశ్వర విద్యా దాన ట్రస్టుకు ఒక్కొక్క దానికి రూ. 75 లక్షలు, బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (బిర్డ్) ట్రస్టుకు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చిందని తెలిపారు ఏఈవో.
అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు, శ్రీ వెంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు ఒక్కొక్క దానికి రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చిందని వెల్లడించారు. కంపెనీ ప్రతినిధి రాజా గోపాల రాజు, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) వివిధ ట్రస్టులకు రూ. 2.50 కోట్ల విరాళం డిమాండ్ డ్రాఫ్ట్లను అందజేసినట్లు తెలిపారు. రాజు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు కార్య నిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డిమాండ్ డ్రాఫ్ట్లను అందజేశారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ అధికారిక సంరక్షకురాలుగా ఉంది.
