ములుగు జిల్లా : ఈసారి జరిగిన మేడారం జాతరను రికార్డు స్థాయిలో 1.55 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తను మంత్రి దాసరి సీతక్కతో కలిసి పర్యటించారు మేడారాన్ని. ఈ సందర్భంగా శ్రీ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం మేడారంలో ప్రజాప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జంపన్న వాగు, హరిత, ఊరట్టం, చిలకల గుట్ట, ఆర్ టి సి జంక్షన్ లను కూలంకషంగా పరిశీలించి, జాతర అనంతరం మిగిలిన, తుది దశకు చేరుకున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతరకు ముందే 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా 5 శాతం పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. జనవరిలో జరిగిన మేడారం జాతరకు 1.55 కోట్ల మంది విచ్చేశారని అంచనా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో మంత్రులు సీతక్క , కొండ సురేఖ , అడ్లూరి లక్ష్మణ్ , ఎంపీ బలరాం నాయక్ , కలెక్టర్, అధికారులందరి సమన్వయంతో, మీడియా సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికా బద్ధంగా జాతర నిర్వహించడం వలన విజయవంతం అయ్యిందన్నారు మంత్రి. ఇందుకు సహరించిన ప్రతిఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు చెప్పారు.
రెండేళ్లకోసారి వచ్చే జాతర మేరకే కాకుండా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా రాతికట్టడాల పనులు పూర్తి చేశాం అన్నారు. అభివృద్ధి చెందిన మేడారాన్ని చూడడానికి ఇకనుండి శని, ఆదివారాలు, ప్రతి సెలవు దినాలు భక్తుల తాకిడి ఉంటుందన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సూచనల మేరకు భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ ను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఏడాది పొడుగునా జంపన్న వాగులో నీరు ఉండేలా, గోదావరి నీటిని తెచ్చే విషయంపై గత నెలలో ఇక్కడే జరిగిన కేబినెట్ లో నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అంతే కాదు జంపన్న వాగుపై మొదటి విడత 5 చెక్ డ్యాంల పనులు త్వరలోనే మొదలు పెడతాం అన్నారు. ఇక్కడున్నరెండు ఇరిగేషన్ ట్యాంకులను బ్యూటిఫికేషన్ చేయబోతున్నామని ప్రకటించారు.
