Amit Shah Meet : ఏపీ బీజేపీ నేతలతో కీలక భేటీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి షా

ఈ సందర్భంగా బీజేపీ కేడర్‌కు కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు...

Amit Shah : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశం విజయవాడలోని నోవోటేల్‌లో ఇవాళ(ఆదివారం) జరిగింది. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు , ఎంపీలు 20 మంది నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కేడర్‌కు కీలక అంశాలపై అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందజేసే సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపైన చర్చ జరిగినట్లు సమాచారం.

Amit Shah Meet AP BJP Leaders…

ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నేతలకు అమిత్ షా సూచించారు. పార్టీ బలోపేతానికి నేతలు అందరూ కృషి చేయాలని, అంతర్గత విభేదాలు పక్కన పెట్టి.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అమిత్ షా ఆదేశించారు. ‘‘హైందవ శంఖారావం’’ సభ విజయవంతం అవడంపై వీహెచ్‌పీ నేతలు, పార్టీ నేతలను అమిత్ షా అభినందించారు.

కాగా..ఈ సమావేశం అనంతరం ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరుకు అమిత్ షా చేరుకుంటారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.11,400 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొండపావులూరులో కేంద్ర సంస్థలను ప్రారంభించడానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై జిల్లా ప్రజలు అభిమానాన్ని చూపించారు.

ఆయన వాహనశ్రేణిపై పూలవర్షం కురిపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన తర్వాత తొలిసారిగా అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో దిగిన ఆయనకు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి అమిత్ షా కాన్వాయ్‌లో చంద్రబాబు ఇంటికి వెళ్లారు. మార్గం మధ్యలో గూడవల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగ్‌, మహానాడు, రమేశ్‌ ఆస్పత్రి, నిర్మలా కాన్వెంట్‌, బెంజిసర్కిల్‌ జంక్షన్లలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు వరుసగా నిలబడి ఆయన వాహనంపై పూలు చల్లారు. కూటమి నేతలకు అమిత్ షా కారులో నుంచి అభివాదం చేశారు. అనంతరం రాత్రి 11 గంటలకు అమిత్ షా నోవోటెల్‌ హోటల్‌కు చేరుకున్నారు. అమిత్ షా పర్యటనలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 1,200 మంది పోలీసులు ఆయన రక్షణలో ఉన్నారు.

Also Read : Actor Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి

Leave A Reply

Your Email Id will not be published!