Anand Mahindra : వయసులో చిన్నోడు పాలనలో గట్టోడు
రిషి సునక్ కు ఆనంద్ మహీంద్రా కితాబు
Anand Mahindra : భారత సంతతికి చెందిన రిషి సునక్ 42 ఏళ్ల వయసులో బ్రిటన్ ప్రధానమంత్రిగా కొలువు తీరారు. ఈ సందర్భంగా అభినందనలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.
వయసులో చిన్నోడైనా పాలనా పరంగా గట్టోడంటూ కితాబు ఇచ్చారు. అతనికి వ్యతిరేకంగా అసమానతలు ఉన్నాయి నిజమే ..కానీ ప్రతిభావంతమైన సమర్థత ఉందన్న విషయం మరిచి పోకూడదని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా(Anand Mahindra). ప్రస్తుతం బ్రిటన్ లో అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో రిషి సునక్ ఒకరుగా గుర్తింపు పొందారు.
రిషి సునక్ చాలా తెలివైన వాడని, అంతే కాదు రాజకీయం కంటే పాలనా పరంగా అనుభవం కలిగిన నాయకుడంటూ ప్రశంసించారు. యుకె చరిత్రలో ఇది ఊహించని పరిణామం. రిషి సునక్ మన భారతీయ మూలాలు కలిగిన వ్యక్తిగా పీఎం స్థాయిలో కొలువు తీరడం మనందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్రా.
రిషి సునక్ తో పాటు ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాకు కూడా ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలు కలిగిన కమలా హారీస్ ఉన్నారని ఇంత కంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భారతీయులు తమ ప్రతిభా పాటవాలతో తమదైన ముద్ర కనబరుస్తున్నారంటూ ప్రశంసించారు.
వ్యక్తులను అంచనా వేసే ముందు వారిలో ఉన్న సానుకూల అంశాలు మాత్రమే తీసుకోవాలని సూచించారు ఈ వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read : బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్