AP Govt : ఏపీలో ఆ రెండు పథకాలపై కీలక అప్డేట్ ఇచ్చిన సర్కార్

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వేడుకగా జరిగింది...

AP Govt : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. త్వరలోనే ఆ రెండు పథకాలను ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం(AP Govt) ప్రకటించింది. ఈ మేరకు జూన్ నెల నుంచి తల్లికి వందనం పథకం అమలులోకి వస్తుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) తెలిపారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి ఒక పేదవారి ఇంట్లో వంట చేసి, ఆ కుటుంబసభ్యులతో సరదా గడిపారు మంత్రి అనిత.

AP Govt Announce

రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వేడుకగా జరిగింది. ప్రతి నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం.. రాష్ట్ర హోంమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు. ఆప్యాయంగా పలకరించారు.. కిచెన్ లోకి వెళ్లి స్వయంగా టీ కాచారు. ఆ ఛాయ్ ని వడపోసి టీ కప్పుల్లో వేసి కుటుంబ సభ్యులందరికీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించి వారితో కాసేపు ముచ్చటించారు. ఒక మంత్రి నేరుగా తమ ఇంటికి రావడం.. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోవడం.. ఆప్యాయంగా పలకరించి టీ పెట్టి ఇవ్వడమే కాదు పెన్షన్ కూడా అందించడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వివరాల్లోకి వెళితే.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉద్ధండపురం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం గోవింద్ ఇంటికి వెళ్లిన మంత్రి అనిత(Home Minister).. వారి కుటుంబాన్ని పలకరించారు. కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా టీ కాచారు. గోవింద్ కుటుంబ సభ్యులకు చాయ్ అందించారు.

ఈ సందర్బంగా హోంమంత్రి అనిత రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు పెట్టిన భిక్షతోనే నేను ప్రజలకు సేవ చేస్తున్నాను అని అన్నారు. ఆదివారం(జూన్ 01) సెలవు కావడంతో, ఫించన్‌లను ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాయకరావుపేట పట్టణంలో అన్నా క్యాంటీన్‌కి శంకుస్థాపన చేశానని, త్వరలో నక్కపల్లి ప్రభుత్వ హాస్పటల్ వద్ద కూడా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. తాగునీటి, సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు అనిత. ఉద్ధండపురం జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరాలు, స్టాఫ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు.

Also Read : Covid 19: ఏలూరు కలెక్టరేట్‌ లో కరోనా కలకలం ! ఐసోలేషన్‌ కు ఉద్యోగులు !

Leave A Reply

Your Email Id will not be published!