AP High Court : జూన్ 6 వరకు మాజీ ఎమ్మెల్యే వంశీకి ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు
వల్లభనేని వంశీ పలు కేసులకు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు...
AP High Court : నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇస్తూ.. జూన్ 6వ తేదీ వరకు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది. అయితే విజయవాడ జిల్లా జైలు అధికారులకు ఇంకా కోర్డు ఆర్డర్ కాపీ అందలేదని, తమకు ఆదేశాలు అందిన తర్వాతే వంశీని ఆస్పత్రికి తరలిస్తామని జైలు అధికారులు చెబుతున్నారు.
AP High Court Gives Interim Order to Vallabhaneni Vamsi
వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) పలు కేసులకు సంబంధించి విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. 90 రోజులకుపైగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయా కేసులకు సంబంధించి వంశీకి న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ ఇళ్ల పట్టాలు తయారుచేసి అందించినట్లు వంశీపై అభియోగాలు రావడంతో దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ప్రస్తుతం వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా గత కొంత కాలంగా వంశీ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదిక అందజేశారు. అలాగే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వంశీ ఆరోగ్య పరిస్థితి సీరియస్ కావడంతో పోలీసులు గుంటూరు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. తాజాగా గురువారం వంశీ ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు హైకోర్టుకు అందజేశారు. బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం.. వైద్యుల నివేదికలను పరిశీలించి.. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి జూన్ 6వ తేదీ వరకు గడువు ఇస్తూ ఇంటర్మ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వంశీ తరఫు న్యాయవాదులు కోర్టు ఆదేశాలు తీసుకుని జిల్లా జైలుకు రానున్నారు. జైలు అధికారులు కోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన తర్వాత ఉన్నతాధికారులను సంప్రదించి ఆస్పత్రికి తరలించే అవకాశముంది.
కాగా గురువారం హైకోర్టులో మరో కీలకమైన తీర్పు వచ్చింది. గన్నవరంలో మైనింగ్కు సంబంధించి మరో పిటి వారెంట్ వంశీపై దాఖలైంది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వంశీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా పరిశీలించిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. కాగా వంశీకి పోలీసుల రక్షణలోనే వైద్యం అందనుంది. జూన్ 6 తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగుపడితే తిరిగి వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు.
Also Read : US Deportations : ఇప్పటివరకు 1080 మంది భారతీయులను డిపార్టు చేసిన అమెరికా