Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మృతిపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం !

పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మృతిపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం !

Bhatti Vikramarka: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆందోళనలకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), పొన్నం ప్రభాకర్‌ ను చూసి మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపించారు. కంటతడి పెట్టుకున్న వారిని డిప్యూటీ సీఎం ఓదార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ పిల్లల పరిస్థితి ఏంటని మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు అడగ్గా… విచారణ చేపట్టి ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Bhatti Vikramarka Comment

అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇద్దరు విద్యార్థుల మృతి, నలుగురి అస్వస్థతపై ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మహేందర్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతినెల విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేయిస్తున్నారా లేదా అంటూ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్‌ని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో వసతులు, సిబ్బంది, డ్యూటీ నర్స్ సంబంధిత అంశాలపై ఆరా తీశారు. చిన్నారులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆశ్రద్ధ చూపించవద్దని హెచ్చరించారు. చిన్నారుల మృతి బాధాకరమని వారి కుటంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.

అయితే మరోవైపు పెద్దాపూర్ గురకుల పాఠశాలలో మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. కొందరు పేరెంట్స్‌ని సమావేశానికి అనుమతించకుండా పోలీసులు బయటే ఆపేశారని ఆగ్రహించారు. డిప్యూటీ సీఎంను కలిసే అవకాశం తమకు ఇవ్వలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, కొందరు చనిపోతున్నారని అయినా తమ గోడును మంత్రులకు చెప్పనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా “మీ పిల్లలు ఇక్కడ చదవడం లేదు.. చనిపోవడం లేదు కదా” అంటూ పోలీసులపై తల్లిదండ్రులు ప్రశ్నించారు. మంత్రి పొన్నం, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ చొరవతో పేరెంట్స్, మీడియాను పోలీసులు సమావేశ మందిరంలోకి అనుమతించారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

Also Read : Tamil University: చెన్నై పురావస్తు పరిశోధనలో లభ్యమైన రాతియుగం నాటి పనిముట్లు !

Leave A Reply

Your Email Id will not be published!