Bhatti Vikramarka : మహమ్మారి ధరణికి మంగళం
నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం తీసుకు వచ్చిన , సకల దరిద్రాలకు కేరాఫ్ గా మారిన ధరణిని రద్దు చేస్తామని మరోసారి ప్రకటించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నా సర్కార్ ను ఏకి పారేస్తున్నారు.
ప్రజా సమస్యలను గాలికి ఒదిలి వేశారని , పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ స్కాంలు, కమీషన్లు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. అన్ని రంగాలను సర్వ నాశనం చేశారని ఆవేదన చెందారు.
విద్యా రంగం కునారిల్లి పోయిందని, ఆరోగ్య రంగం ఆగమై పోయిందని మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. గత 9 సంవత్సరాలుగా ఏనాడూ అమర వీరుల గురించి, వారి కుటుంబాల గురించి ఒక్క మాట కూడా కేసీఆర్ మాట్లాడ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అమర వీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ప్రతి నెలా రూ. 25 వేలు పెన్షన్ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. కొలువు తీరిన వెంటనే కొలువుల భర్తీకి సంతకం చేస్తామని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Sonia Gandhi : సంయమనం పాటించండి – సోనియా
