Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి పాశ్వాన్ పోటీ చేస్తున్నారా..?
రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనను గత వారంలో చిరాగ్ బయటపెట్టారు...
Bihar Assembly Elections : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి. మూడుసార్లు లోక్సభకు ఎంపీగా గెలిచిన చిరాగ్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Assembly Elections) పోటీ చేయనుండటం ఇదే ప్రథమం. చిరాగ్ పాశ్వాన్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గ నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి, జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారంనాడు ఒక ట్వీట్లో కోరారు. దీంతో చిరాగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Bihar Assembly Elections Update
రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ఆలోచనను గత వారంలో చిరాగ్(Chirag Paswan) బయటపెట్టారు. హజీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా తెలిపారు. దీనికి బలం చేకూరుస్తూ అరుణ్ భారతి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆదివారంనాడు ఒక పోస్ట్ చేశారు. ‘బీహార్ ఫస్ట్, బీహారీ ఫస్ట్’ అనేది చిరాగ్ ముఖ్యోద్దేశమని, అది నిజం చేయాలంటే బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ముందుండి చురుకుగా పాల్గొనాలని అన్నారు. ఒక కమ్యూనిటి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా జనరల్ కేటగిరి నుంచి చిరాగ్ పోటీచేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర రాజకీయాలకు పెద్ద పాత్రను పోషించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని, చిరాగ్ ఇవాళ బీహార్కు ఒక ప్రతినిధి మాత్రమే కాదని, రాష్ట్ర ఆశాకిరణమని అన్నారు.
మీడియా కథనాల ప్రకారం పాట్నా, ధనపూర్, హాజపూర్లలో ఏదో ఒకచోట పోటీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చిరాగ్ ఇంతవరకూ లోక్సభ ఎన్నికల్లో జాముయి, హజీపూర్ రిజర్వ్డ్ నియోజక వర్గాల నుంచే పోటీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతవరకూ పోటీ చేయలేదు.
చిరాగ్ పాశ్వాన్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి వైదొలిగారు. నితీష్ కుమార్తో విభేదాల కారణంగా ఆయన సొంతంగా అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో అధికార పార్టీ బలహీనపడి బీజేపీ బలపడింది. పాశ్వాన్ పార్టీ ఒక సీటు మాత్రమే గెలిచినప్పటికీ తిరిగి లోక్సభ ఎన్నికల నాటికి పుంజుకుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 5 స్థానాల్లో పోటీచేసి గెలుపొందింది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్డీయేలో సీట్ల షేరింగ్ చర్చలు ఇంకా ప్రారంభం కాలేదు.
Also Read : Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పై అధికారిక అభియోగాలు