CM Chandrababu Naidu: వైసీపీ “వెన్నుపోటు దినం” పై సీఎం చంద్రబాబు సెటైర్లు
వైసీపీ "వెన్నుపోటు దినం" పై సీఎం చంద్రబాబు సెటైర్లు
CM Chandrababu Naidu : కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన నేటికి ఏడాది అయిన సందర్భంగా… ఎన్నికల ముందు హామీలు ఇచ్చి… గెలిచిన తరువాత ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ… “వెన్నుపోటు దినం” పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) పిలుపుమేరకు… రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ “వెన్నుపోటు దినం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైసీపీ చేపట్టిన “వెన్నుపోటు దినం” పై సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు … ప్రజా విప్లవానికి ‘నియంత’ కొట్టుకుపోయిన రోజు ఇది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసారు.
CM Chandrababu Naidu Slams
ఈ మేరకు తన అఫీషియన్ సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఆయన పోస్టు చేశారు. ‘‘అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు. సైకో పాలనకు అంతం పలికి… ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు. ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు. పసుపు సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, కమలనాథుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజు.
ఏడాది క్రితం ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతి రోజూ పనిచేస్తున్నాం. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు పాలనను గాడిన పెట్టాం. సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని పట్టాలెక్కించాం. రాష్ట్ర దశ, దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వచ్చే 4 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని మాట ఇస్తున్నాం. విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలు, నాయకులకు అభినందనలు.. ధన్యవాదాలు. జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్!’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : Minister Nara Lokesh: పవన్ కల్యాణ్ కు ‘యువగళం’ పాదయాత్ర పుస్తకం అందజేసిన లోకేశ్