CM Revanth Reddy : అభయ హస్తం పేదల నేస్తం
ప్రజా పాలన దరఖాస్తు విడుదల
హైదరాబాద్ – పేదల నేస్తం అభయ హస్తం అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం సచివాలయంలో ప్రజా పాలనకు సంబంధించి దరఖాస్తు నమూనా పత్రాన్ని విడుదల చేశారు. సర్కార్ తీసుకు వచ్చే ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి పొందాలంటే ఒకే దరఖాస్తు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈనెల 28న గురువారం నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కింద అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని చెప్పారు రేవంత్ రెడ్డి. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్య శ్రీ కింద రూ. 10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.
మిగతా నాలుగు గ్యారెంటీల అమలుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం. గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం , రూ.500 గ్యాస్ సిలిండర్ సదుపాయం పొందాలంటే దరఖాస్తులో టిక్ చేయాల్సి ఉంటుంది. రైతు భరోసా పొందాలంటే రైతు, కౌలు రైతా అన్నది నమోదు చేయాలి. పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, భూమి వివరాలు నమోదు చేయాలి.
ఇండ్ల పథకం పొందాలంటే కాలమ్ లో నింపాలి. అమర వీరులు, ఉద్యమ కారులకు సైతం ఇదే దరఖాస్తులో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గృహ జ్యోతి పథకం పొందాలంటే వివరాలు తెలియ చేయాలి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య నమోదు చేయాలి. చేయూత పథకం పొందాలంటే నెలకు 4 వేల రూపాయల సౌకర్యం కల్పించింది.