CM Revanth Reddy : బీఆర్ఎస్ సర్కార్ విద్యార్థులను మోసం చేసింది
పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు...
CM Revanth Reddy : బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండపడ్డారు. తమ ప్రభుత్వం హయాంలో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కేసీఆర్(KCR) కుటుంబ సభ్యులకు మాత్రం ఉద్యోగాలు వచ్చాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బుధవారం హైదరాబాద్లోని బాబూ జగజ్జీవన్రామ్ భవన్లో ఎస్సీ గురుకులాల్లో టెన్త్, ఇంటర్ చదివి.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదంటూ బీఆర్ఎస్(BRS) నేతలను ఆయన నిలదీశారు.
CM Revanth Reddy Slams
పీజీలు చేసిన విద్యార్థులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్న పిల్లలకు తాము ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. ఒక్క ఏడాదిలోనే 59 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. గత 15 ఏళ్లుగా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. తమ హయాంలో 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్నామని వివరించారు. గ్రూప్-1లో 89% పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు దక్కాయని సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు.
ఇంకా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏమన్నారంటే.. ఈ రోజు అంటే బుధవారం తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నామన్నారు. కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని తెలిపారు. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారని ఆయన స్పష్టం చేశారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఆత్మనూన్యత భావాన్ని వీడాలంటూ దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. వారిలోని ఆత్మనూన్యత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు తెచ్చారని గుర్తు చేశారు. కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా? అని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. అంతేకాదు గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు సైతం విడుదల చేశామన్నారు. కానీ నోటికాడి కూడును కింద పడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని గత ప్రభుత్వ పెద్దలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోందని పేర్కొన్నారు.
వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆరు నెలలు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారని బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిప్పులు చెరిగారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండంటూ యువతకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారన్నారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుందని విద్యార్థులకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దంటూ విద్యార్థులకు హితవు పలికారు. కష్టపడండి.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.
వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని వైస్ చాన్స్లర్గా నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళిని నియమించామని గుర్తు చేశారు. అలాగే అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నామని వివరించారు. వీరందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు.. చదువుకున్నారు కాబట్టే వారికి ఈ గుర్తింపు వచ్చిందని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందన్నారు. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా తాను కోరుకుంటున్నానని తెలిపారు. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read : TG High Court : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ‘ఆపరేశ్ కుమార్’