CM Revanth Reddy: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత – సీఎం రేవంత్
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత - సీఎం రేవంత్
CM Revanth Reddy : నిస్సహాయకులకు సహాయం అందించడమే మన బాధ్యత అని అని గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) సూచించారు. ‘‘తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊరును అభివృద్ధి చేసుకోవడం మన బాధ్యత… మీరందరూ అంకితమవుతారని పూర్తి విశ్వాసం ఉంది. ఉద్యోగార్థులు ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోకపోతే … మీ జీతంలో 10 నుంచి 15శాతం కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుందో… అలాగే మీ తల్లిదండ్రుల అకౌంట్లో ఒకటో తేదీన పడుతుంది. దీని కోసం త్వరలో చట్టం తీసుకొస్తాం’’ అని సీఎం అన్నారు.
CM Revanth Reddy Shocking Comments
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన కార్యక్రమంలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar).. చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘శ్రీకాంతాచారి, వేణుగోపాల్రెడ్డి, ఈషాన్రెడ్డి, యాదయ్య లాంటి యువ విద్యార్థులు తమ జీవితాలను ధారపోసి… ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. యూనివర్సిటీల్లో ఉంటూ వేలాది మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
కానీ, ఆనాటి రాజకీయ పార్టీల నాయకులు.. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాన్ని, తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మార్చుకొని పదేళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారు. కానీ, నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వాళ్ల కుటుంబ సభ్యులు, బందు వర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయటం కోసమే పదేళ్లు పరిపాలన సాగింది. ప్రజల గురించి ఆలోచించి ఉంటే కాళేశ్వరం..కూలేశ్వరం అయి ఉండేది కాదు. రూ.లక్ష కోట్లతో కట్టిన ఒక ప్రాజెక్టు మూడేళ్లకే కూలిన ఘటన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.
తన ఫామ్హౌజ్లో ఎకరా పంటపై రూ.కోటి ఆదాయం వస్తుందని ఒక పెద్దాయన చెప్పారు. ఎకరాపై రూ.కోటి ఆదాయం వచ్చే విద్యను యువత, ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో చదవిన నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ఆశీర్వాదాలే కారణం. రూ.3కోట్లు తీసుకుని గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు ఆరోపణలు చేశారు. పేదింటి బిడ్డలు రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా? కష్టపడి చదివిన వారిని అవమానించేలా మాట్లాడారు. రాజకీయ చౌకబారు విమర్శలు విమర్శలు ఎదుర్కొన్నప్పడు చాలా ఆవేదన కలిగింది. గతంలో ఎన్నడూ జరగని కులగణన.. కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుంది’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
Also Read : Chirag Paswan: మాకు నవంబర్ 14న దీపావళి పండుగ – చిరాగ్ పాసవాన్
