Covid 19: ఏలూరు కలెక్టరేట్ లో కరోనా కలకలం ! ఐసోలేషన్ కు ఉద్యోగులు !
ఏలూరు కలెక్టరేట్ లో కరోనా కలకలం ! ఐసోలేషన్ కు ఉద్యోగులు !
Covid 19 : ఏలూరు కలెక్టరేట్ లో కరోనా కలకలం రేపింది. కలెక్టరేట్లో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్గా వైద్యులు నిర్థారించారు. దీనితో వారిని హోం ఐసోలేషన్కు తరలించారు. శుక్రవారం కలెక్టరేట్ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా… ఐదుగురికి కోవిడ్(Covid 19) పాజిటివ్ అని తేలింది. మిగిలిన సిబ్బందికి నెగెటివ్గా వచ్చింది. కలెక్టరేట్ లో ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో తోటి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
Covid 19 Cases
రెండుమూడేళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహామ్మారి… మళ్ళీ పంజా విసురుతోంది. దేశంలో 90 శాతానికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఇటీవల కాలంలో మళ్ళీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ అధికారులు ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఏలూరు కలెక్టరేట్ సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. శనివారం ఉదయం రిజల్ట్ రాగా… కరోనా పాజిటివ్ అని వచ్చిన ఐదుగురు ఉద్యోగులను హోం ఐసోలేషన్కు తరలించారు. మొత్తం కలెక్టరేట్లోని రెండు సెక్షన్ల సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో కరోనా(Covid 19) చాప కింద నీరులా పారుతోంది. గత కొన్ని రోజులుగా పదికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా ఏలూరులోనే దాదాపు ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఏలూరు కలెక్టరేట్లో మరో ఐదు కేసులు బయటపడటంతో జిల్లాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో తణుకుకు సంబంధించి ఓ ఉద్యోగికి కరోనా సోకింది. చికిత్స అనంతరం తిరిగి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. ఏలూరు కలెక్టరేట్లో కరోనా నిర్ధారణ అవడంతో అప్రత్తమైన అధికారులు ఎక్కడికక్కడ శానిటైజేషన్ చర్యలు చేపట్టారు. ఇక ఏపీలో తొలి కరోనా కేసు విశాఖపట్నంలో నమోదు అయ్యింది. విశాఖకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే చికిత్స అందేశారు. ఆమె కుటుంబం ఉంటోన్న పరిసరాల్లో శానిటైజేషన్ చేశారు. అలాగే కడప రిమ్స్లో 70 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ అని తేల్చారు వైద్యులు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న మహిళకు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనాగా నిర్ధారణ అయ్యింది.
Also Read : Mega DSC: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల ! వెబ్ సైట్ లో హాల్ టిక్కెట్లు !