Crackers Blast: బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం ! 8మంది మృతి !

బాణసంచా తయారీ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం ! 8మంది మృతి !

Crackers Blast : అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం(Crackers Blast) సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా… మరో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు తరలించారు. బాధితుల్లో ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా బాణాసంచా తయారీ కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిని అనకాపల్లి కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తో కలిసి హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. కొంతమంది క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం కేజీహెచ్‌ కు తరలించారు.

కోటవురట్ల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా… మరో ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది, ఈ ఘటనపై కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విచారణకు ఆదేశించారు.

Crackers Blast – ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్‌, ఎస్పీలతో ఆయన ఫోన్‌ లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీవోను ఆదేశించారు. నర్సిపట్నం ఏరియా ఆస్పత్రిని ఆయన అప్రమత్తం చేశారు. బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

అనకాపల్లి ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

అనకాపల్లి(Anakapalli) జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నిధుల నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల పరిహారం ప్రకటించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని(AP) అనకాపల్లి(Anakapalli) జిల్లాలో జరిగిన ప్రాణనష్టం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందిస్తోంది’’ అని ప్రధాని ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఘటనపై పవన్‌, లోకేశ్ తీవ్ర విచారం

కోటవురట్ల ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణసంచా పరిశ్రమలోఅగ్నిప్రమాదం(Crackers Blast) ఘటనపై మంత్రి నారా లోకేశ్‌(Nara Lokesh) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

మృతి చెందిన వారి వివరాలు:

1. దాడి రామలక్ష్మి (35), W/oవెంకటస్వామి, R/o రాజుపేట .
2. పురం పాప (40), W/o అప్పారావు, R/o కైలాసపట్నం.
3. గుంపిన వేణుబాబు (34), S/o దేముళ్ళు,R/o కైలాసపట్నం.
4. సంగరాతి గోవిందు (40), S/o సత్యనారాయణ, R/o కైలాసపట్నం.
5. సేనాపతి బాబూరావు (55), S/o గెడ్డప్ప , R/o చౌడువాడ.
6. అప్పికొండ పల్లయ్య (50), S/o నూకరాజు , R/o కైలాసపట్నం.
7. దేవర నిర్మల (38), W/o వీర వెంకట సత్యనారాయణ, R/o వేట్లపాలెం.
8. హేమంత్ (20), R/o భీమిలి.

మృతుల కుటుంబాలకు 15 లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా

కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద సంఘటనలో మరణించిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం 15 లక్షల రూపాయల ఎక్సిగ్రేషియా ప్రకటించడం జరిగిందని, క్షతగాత్రులను మెరుగైన వైద్య నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి కి మరియు విశాఖపట్నం కె.జి.హెచ్. తరలించడం జరిగిందని వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాద సంఘటన ప్రదేశాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎమ్. జాహ్నవి, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా సందర్శించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.

హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సంఘటన ప్రదేశాన్ని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దురదృష్టకరమని, దుర్ఘటనలో 8 మంది చనిపోయారని, 8 మంది గాయపడ్డారని తెలిపారు. మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. దురదృష్టకర సంఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని, సహాయక చర్యలపై ఆరా తీశారని, మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ సంఘటనలో గాయపడిన వారిలో ఆరుగురిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విశాఖపట్నం కెజిహెచ్ కు, ఇద్దరిని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని, వారికి కావలసిన పూర్తి వైద్య సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.

ప్రాథమిక సమాచారo ప్రకారం బాణసంచా తయారీ కేంద్రానికి అనుమతులు ఉన్నాయని, 2026 వరకు లైసెన్స్ పొందినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 16 మంది పని చేస్తున్నారని, వారిలో 8 మంది చనిపోయారని, 8 మంది గాయపడ్డారన్నారు. ప్రాథమిక సమాచార ప్రకారం మందుగుండు తయారీ సమయంలోనే ఒత్తిడి గురై పేలుడు సంభవించినట్లు తెలియజేశారని, ప్రమాద సంఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని, విచారణ అనంతరం పేలుడు జరుగుటకు గల కారణాలు తెలుస్తాయన్నారు.

Also Read : Anna Lezhneva: తిరుమల శ్రీవారి సేవకు పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా

Leave A Reply

Your Email Id will not be published!