Rinku Singh-Priya Saroj: వైభవంగా క్రికెటర్ రింకు సింగ్ ఎంపీ ప్రియా సరోజ్ ఎంగేజ్మెంట్

ఉత్తరప్రదేశ్‌లో అత్యల్ప వయస్సులో ఎంపీగా ఎన్నికైనవారిలో ఆమె ఒకరు...

Rinku Singh : టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం లక్నోలో ఘనంగా జరిగింది. జూన్ 8, 2025 శనివారం, లక్నోలోని ది సెంట్రమ్ 5-స్టార్ హోటల్‌లో ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి క్రికెట్ మరియు రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

Rinku Singh- Priya Saroj Engaged

ఈ వేడుకలో రింకు సింగ్(Rinku Singh), ప్రియా సరోజ్ తెలుపు మరియు గులాబీ రంగుల దుస్తుల్లో మెరిసిపోతూ అందరినీ ఆకర్షించారు. ఫుల్క్రన్ హాల్ పూల అలంకరణలు, రంగురంగుల లైట్లతో అద్భుతంగా సజ్జమైంది. దాదాపు 300 మందికి పైగా అతిథులు పాల్గొన్న ఈ వేడుకలో పలువురు క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ నిశ్చితార్థానికి మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, యూపీ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులుగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ఎంపీ ఇక్ర హసన్, ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నేత, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా హాజరయ్యారు.

రింగులు మార్పిడికి ప్రత్యేకంగా 12×16 అడుగుల స్టేజ్ ఏర్పాటు చేశారు. లక్నో ప్రత్యేక వంటకాలు, రింకు-ప్రియా ఎంపిక చేసిన రుచికరమైన వంటకాలు అతిథులకు వడ్డించారు. ది సెంట్రమ్ హోటల్‌లో అతిథుల కోసం 15 గదులు బుక్ చేయగా, రింకు సింగ్ సన్నిహితుల కోసం 5 గదులు ప్రత్యేకంగా కేటాయించారు. బార్‌కోడ్ పాస్ ఉన్నవారికే ఈ వేడుకకు ప్రవేశం ఇచ్చారు.

రింకు సింగ్: 27 ఏళ్ల రింకు సింగ్ టీమిండియాకు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా సేవలందిస్తున్నారు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రింకు, 2023లో గుజరాత్ టైటాన్స్‌పై ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు కొట్టి దేశవ్యాప్తంగా పేరొందారు. దేశీయ క్రికెట్‌లోనూ మంచి ఫామ్‌లో ఉన్నారు.

ప్రియా సరోజ్: 26 ఏళ్ల ప్రియా సరోజ్(Priya Saroj), సమాజ్ వాదీ పార్టీ తరపున మచ్లీషహర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్ప వయస్సులో ఎంపీగా ఎన్నికైనవారిలో ఆమె ఒకరు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా, ప్రస్తుతం యూపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో BA, అమిటీ యూనివర్సిటీలో LLB పూర్తి చేసిన ప్రియా, రాజకీయాల్లోకి రాకముందు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పని చేశారు.

ఈ నిశ్చితార్థం ద్వారా క్రీడా, రాజకీయ రంగాల కలయికగా ఈ జంట నిలిచింది. వీరి వివాహం నవంబర్ 18, 2025న వారణాసిలో జరగనుంది. ఈ శుభసందర్భంగా రింకు సింగ్, ప్రియా సరోజ్‌లకు ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read : NDA 2025 Recruitment : ఇంటర్ అర్హతతో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉద్యోగాలు..

Leave A Reply

Your Email Id will not be published!