Delhi New CM : వాయిదా పడ్డ ఢిల్లీ బీజేపీ ఎల్పీ సమావేశం.. సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ
ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు...
Delhi New CM : బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. ఇవాళ (సోమవారం) జరగాల్సిన బీజేఎల్పీ సమావేశాన్ని అధిష్ఠానం ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. నేటితో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి తెరపడుతుందని అంతా భావించారు. కాగా, ఢిల్లీ పార్టీ కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. దీంతో నూతన సీఎంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Delhi New CM-BJP LP Meeting Postponed
ఫిబ్రవరి 19న జరిగే సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన 48 మంది బీజేపీ(BJP) ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. అలాగే కమలం పార్టీ ఎంపీలు సైతం హాజరుకానున్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేలు లెఫ్టినెంట్ గవర్నర్ను కలవనున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్లను బీజేపీ(BJP) అధిష్ఠానం నియమించింది. మరోవైపు ఫిబ్రవరి 20న ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి తేదీ సైతం ఖరారు చేసింది. కాగా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ(న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా) ఉన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అక్కడ అధికారంలోకి రానుంది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవలం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తోపాటు పలువురు కీలక నేతలు ఓటమి పాలయ్యారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే విషయం ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read : CM Chandrababu : గుంటూరు రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై స్పందించిన సీఎం